Vaibhav Sooryavanshi: గౌహతి వేదికగా ముంబై జట్టు తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు కొట్టి దుమ్మురేపాడు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ లో అయితే రెండు సిక్సర్లు కొట్టి తన సత్తా ఏమిటో చూపించాడు. ఆ స్థాయిలో బ్యాటింగ్ చేసిన తర్వాత కామెంట్రీ బాక్స్లో రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి.
ముఖ్యంగా తెలుగు వ్యాఖ్యాతలయితే సూర్య వంశీకిపెద్దలంటే గౌరవం లేదని.. కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేస్తున్నాడని సరదాగా కామెంట్లు చేశారు. ఏ ముహూర్తంలో అయితే వారు ఆ మాటలు అన్నారో తెలియదు గాని.. సోషల్ మీడియా మొత్తం వాటి గురించే చర్చ మొదలైంది. నిజానికి వైభవ్ కు అలాంటి వ్యక్తిత్వం ఉండదు. మైదానంలో అతడు దూకుడుగానే ఆడతాడు. ఈ విషయాన్ని అతడు అనేక సందర్భాల్లో చెప్పాడు. ఒకసారి మైదానంలోకి దిగిన తర్వాత బౌలర్ ఎవరనేది తాను చూడనని సూర్య వంశీ స్పష్టం చేశాడు. తన దృష్టి మొత్తం బంతి మీద ఉంటుందని.. దానిని ఎప్పుడు స్టాండ్స్ అవతలికి పంపించాలి అనే ఆలోచన మాత్రమే తనలో కలుగుతుందని అతడు ఓపెన్ గానే చెప్పేశాడు
ఇటీవల ఇండియన్ క్రికెటర్లకు బీసీసీఐ అవార్డులు ఇచ్చే ఫంక్షన్ లో కూడా సూర్య వంశీ మనోగతాన్ని రాజస్థాన్ రాయల్స్ పూర్వ సారథి సంజు శాంసన్ వెల్లడించాడు. తెలుగు వ్యాఖ్యాతలు మాత్రం నిన్న బుమ్రా బౌలింగ్లో సూర్య వంశీ ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయడంతో అతడికి పెద్దలు అంటే భయం నేర్పండి.. కాస్త రెస్పెక్ట్ అంటే ఏంటో వివరించండి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. వాళ్లు ఆ మాటలు అన్నారో లేదో.. ఆ మాటలు సూర్య వంశీ విన్నాడో లేదో తెలియదు గాని.. మొత్తానికి తనలో ఉన్న మంచి బాలుడిని బయట పెట్టాడు.
నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బోగ్లే మైదానంలోకి వచ్చాడు. అతడిని చూసిన తర్వాత వైభవ్ కాళ్లకు నమస్కారం చేసి.. అతడి ఆశీస్సులు తీసుకున్నాడు. అంతేకాదు.. మీ సపోర్ట్ నాకు ఉండాలంటూ అతడితో చెప్పాడు. హర్ష కూడా అతడి ప్రవర్తనను చూసి మెచ్చుకున్నాడు. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండడం అనేది అత్యంత ముఖ్యం. ఇప్పుడు వైభవ్ దానిని పాటిస్తున్నాడు. ఇకనుంచి తెలుగు వ్యాఖ్యలు అలాంటి వ్యాఖ్యలు చేయబోరని సోషల్ మీడియాలో కామెంట్లు సరదాగానే వినిపిస్తున్నాయి.
Vaibhav Suryavanshi touching the feet of Harsha Bhogle. ❤️
– Suryavanshi, humble as ever. pic.twitter.com/Xuc8BnR5NW
— Johns. (@CricCrazyJohns) April 8, 2026