Team India: ముంబైలో విరాట్, రోహిత్ డ్యాన్స్.. వందేమాతరం పాడిన ఫ్యాన్స్.. వీడియో వైరల్

17 సంవత్సరాల తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది. ఈ విజయం నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు, అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. ప్రపంచ కప్ ను సాధించిన ఆనందంలో కన్నీటి పర్యంతమవుతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 5, 2024 11:56 am

Team India

Follow us on

Team India: వాంఖడె స్టేడియం దద్దరిల్లింది. భారత జట్టును కీర్తిస్తూ అభిమానులు చేసిన సందడితో మార్మోగిపోయింది. సన్మాన కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జాతీయ పతాకాన్ని భుజాల మీద మోస్తూ స్టేడియంలో ముందుండి నడిచారు. స్టేడియానికి హాజరైన అశేషమైన అభిమాన గణాన్ని ఉద్దేశించి.. అభివాదాలు చేశారు. ఆటగాళ్ల రాకతో ముంబై నగరం మొత్తం జనసముద్రంగా మారింది. రోడ్లు మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఇక వాంఖడె మైదానంలో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయే సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. రోమాలు నిక్కబొడిచే స్పీచ్ లతో రోహిత్, విరాట్ అదరగొట్టారు. అద్భుతమైన మాస్ డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.

17 సంవత్సరాల తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది. ఈ విజయం నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు, అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. ప్రపంచ కప్ ను సాధించిన ఆనందంలో కన్నీటి పర్యంతమవుతున్నారు. గురువారం ఉదయం ప్రపంచ కప్ తో టీమ్ ఇండియా స్వదేశానికి వచ్చింది. న్యూఢిల్లీ విమానాశ్రయంలో టీమ్ ఇండియా ఆటగాళ్లకు అదిరిపోయే స్థాయిలో స్వాగతం లభించింది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో భేటీ తర్వాత ఆటగాళ్లు గురువారం మధ్యాహ్నం ముంబై వెళ్ళిపోయారు. సాయంత్రం అక్కడికి చేరుకున్న తర్వాత ముంబై విమానాశ్రయంలో ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ముంబై వీధులన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఇండియా.. ఇండియా అంటూ చేసిన నినాదాలు హోరెత్తించాయి. వాంఖడె స్టేడియంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో అభిమానులు సందడి చేశారు. ఇదే క్రమంలో ఆటగాళ్లు అభిమానులను ఉత్సాహపరిచారు.. జట్టు సభ్యులతో కలిసి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదిరిపోయే స్టెప్పులు వేశారు. తమ స్టార్ డం మర్చిపోయి డాన్స్ చేశారు. సూర్య కుమార్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా కూడా కాలు కదిపారు. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విరాట్ మైదానంలో డ్యాన్స్ చేసినప్పటికీ.. రోహిత్ మాత్రం ఆ పని చేయలేదు. అయితే వీరిద్దరూ డాన్స్ చేయడం బహుశా ఇదే తొలిసారి అని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.. మీ దగ్గర నుంచి ఆశించేది ఇదే కదా అంటే అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అంతకుముందు ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన టీమిండియా ఆటగాళ్ల విమానానికి.. విమానాశ్రయంలో సిబ్బంది వాటర్ వెల్కమ్ చెప్పారు. అటూ ఇటూ పెద్ద పెద్ద వాటర్ పంపింగ్ మిషన్లతో నీళ్లు చల్లుతూ విమానానికి ఘన స్వాగతం పలికారు. ఆటగాళ్లు దిగిన తర్వాత విమానాశ్రయంలో సిబ్బంది పూలదండలు వేసి.. ముంబై మహానగరంలోకి ఆహ్వానం పలికారు.. వాంఖడెలో కనీ వినీ ఎరుగనిస్థాయిలో బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. ఆటగాళ్లకు అద్భుతమైన సత్కారం చేసింది.. 2011లో ఇదే మైదానం వేదికగా టీమిండియా శ్రీలంక జట్టుపై వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి.. రెండోసారి ట్రోఫీ దక్కించుకుంది. టీమిండియా కు కలిసి వచ్చిన మైదానంగా వాంఖడె కు పేరుంది. అందుకే ఈ మైదానం వేదికగా సన్మాన కార్యక్రమాన్ని బిసిసిఐ నిర్వహించింది.