Pakistan Cricket Board controversy: టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియాతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన మ్యాచ్ ను రద్దు చేసుకుంటున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇటీవల ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం మేరకు తాము ఇలా చేయక తప్పడం లేదని సమర్థించుకుంది. దీంతో ఐసీసీ పెద్దలు స్పందించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో. . బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పెద్దలతో సంప్రదింపులు జరపడం మొదలుపెట్టారు.
వాస్తవానికి పాకిస్తాన్ ఆడేందుకు ఐసీసీ తటస్థ వేదికలను రూపొందించింది. ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు కొలంబో వేదికగా మాత్రమే మ్యాచులు ఆడుతుంది. ఇప్పటికే నెదర్లాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్తాన్ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొని విజయం సాధించింది. అయితే భారత జట్టుతో జరిగే మ్యాచ్ రద్దు చేసుకోవడం వల్ల ఐసీసీకి భారీగా నష్టం ఏర్పడుతుంది. అంతేకాదు ఈ టోర్నీ ప్రసార హక్కులను దక్కించుకున్న డిస్నీ హాట్ స్టార్ కూడా తీవ్రంగా నష్టపోతుంది. అందువల్లే ఐసీసీ సంప్రదింపులు జరిపింది. భారత జట్టుతో జరిగే మ్యాచ్ రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ సూచనలను.. విజ్ఞప్తులను ఐసిసి పరిగణలోకి తీసుకోకపోవడమేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు స్పష్టం చేశారు. అయితే సోమవారం ఐసీసీ పెద్దలతో జరిగిన భేటీలో మాత్రం పాకిస్తాన్ తన అసలు రూపాన్ని ప్రదర్శించింది. వాస్తవానికి భారత జట్టుతో మ్యాచ్ రద్దు చేసుకోవడానికి కారణం బంగ్లాదేశ్ కానే కాదు.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును అడ్డం పెట్టుకొని ఐసీసీ నుంచి భారీగా లబ్ధి పొందాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్కెచ్ వేసింది. వాస్తవానికి పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు మొత్తం తటస్థ వేదికగా జరుగుతున్నాయి. అయితే టోర్నీ నుంచి అర్ధాంతరంగా బయటికి వెళ్తే ఐసీసీ నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. చావు తెలివితేటలను ప్రదర్శించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు వంత పాడింది. సరికొత్త డ్రామాలకు శ్రీకారం చుట్టింది. ఈ టోర్నీ నుంచి తప్పుకుంటామని చెప్పిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఐసీసీ కఠిన చర్యలను ముందుగానే ఊహించింది. అందువల్లే టీమ్ ఇండియాలో జరిగే మ్యాచ్ ను మాత్రమే తాము బహిష్కరిస్తామని ప్రకటించింది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేనిపోని ఆరోపణలను భారత క్రికెట్ నియంత్రణ మండలి మీద చేసింది. తమ జట్టు ఆటగాళ్లకు భారత్ లో భద్రత లేదని ఆరోపించింది. దీంతో ఐసీసీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళింది. ఐసీసీ పరిశీలనలో బంగ్లాదేశ్ చెబుతుందంతా అబద్ధమని తేలింది. బంగ్లాదేశ్ విజ్ఞప్తులను ఐసిసి పక్కన పెట్టింది. ఇదే అదునుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సరికొత్త గ్రామాలకు శ్రీకారం చుట్టింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును అడ్డం పెట్టుకొని భారీగా లబ్ధి పొందాలని చూసింది. లేనిపోని కోరికలను కోరింది. అయితే పాకిస్తాన్ విజ్ఞప్తులను.. సూచనలను ఐసిసి మొహమాటం లేకుండా తిరస్కరించిందని సమాచారం.