Team India WTC Final : బంగ్లా పై సిరీస్ విజయం సరే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ పరిస్థితి ఏమిటి? సమీకరణాలు ఎలా ఉన్నాయంటే?

టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా దూసుకుపోతోంది. 45 రోజులపాటు సుదీర్ఘ విశ్రాంతి లభించినప్పటికీ.. రోహిత్ సేన దూకుడు మంత్రాన్ని కొనసాగిస్తోంది. బంగ్లా దేశ్ తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో దక్కించుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 1, 2024 10:30 pm

Team India WTC Final

Follow us on

Team India WTC Final  : ఫలితం తేలడం కష్టమని భావించిన కాన్పూర్ మైదానంపై చివరి రెండు రోజుల్లో ఫలితాన్ని రాబట్టింది.. టెస్ట్ లోనూ టి20 తరహా లో ఆటతీరు ప్రదర్శించి ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది.. అసాధారణ ఆట తీరుతో బంగ్లాదేశ్ జట్టును ఓడించింది. వర్షం వల్ల ఈ మ్యాచ్ రెండున్నర రోజులు తుడిచిపెట్టుకుపోయింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఫలితం తేలడం కష్టమని అందరూ భావించారు. కానీ టీమిండియా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అద్భుతమైన ఆటతీరుతో ఏకపక్ష విజయాన్ని సొంతం తీసుకుంది. బౌలర్లు అసాధారణంగా చెలరేగారు. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ఫలితంగా మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. ప్రతిదీ టీమిండియా కు అనుకూలంగా రూపాంతరం చెందింది.

మరింత బలోపేతం చేసుకుంది

బంగ్లాదేశ్ జట్టుతో 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకోవడంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో పాయింట్లు మరింత బలోపేతం చేసుకుంది. తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. అంతేకాకుండా ఏ జట్టుకూ దక్కని అదృష్టాన్ని సొంతం చేసుకునేందుకు తాపత్రయపడుతోంది. స్వదేశంలో జరిగే న్యూజిలాండ్ సిరీస్ ను కూడా 3-0 తేడాతో గెలిచి, ఆస్ట్రేలియాపై కూడా అదే స్థాయిలో సత్తా చాటి మూడోసారి డబ్ల్యూటీసి ఫైనల్ వెళ్లాలని భావిస్తోంది. ఇప్పటివరకు డబ్ల్యూటీసీ 2023-25 లో భాగంగా 11 మ్యాచ్ లను టీమిండియా ఆడింది.. ఎనిమిది విజయాలు సొంతం చేసుకుంది. ఒక మ్యాచ్ డ్రా అయింది. మరో రెండు మ్యాచ్ లలో పరాజయాన్ని చవి చూసింది. భారత జట్టు ప్రస్తుతం 74.27 విక్టరీ పర్సంటేజ్ తో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇక జూన్ లో లార్డ్స్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుంది. దానికంటే ముందు టీం ఇండియా ఎనిమిది టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టుల సిరీస్ మొదలవుతుంది. ఆ తర్వాత నవంబర్ లో ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడుతుంది.. ఎలాంటి లెక్కలతో సంబంధం లేకుండా టీమిండియా డబ్ల్యూటీసి ఫైనల్ వెళ్లాలంటే ఈ ఎనిమిది మ్యాచ్లలో మూడింటిలో విజయం సాధించాలి.. ఒకవేళ న్యూజిలాండ్ జట్టుపై క్లీన్ స్వీప్ చేస్తే.. ఆస్ట్రేలియా తో జరిగే టోర్నీతో సంబంధం లేకుండా టీమిండియా నేరుగా ఫైనల్ వెళ్తుంది. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు అత్యంత బలహీనంగా ఉంది. ఇటీవల శ్రీలంక టెస్ట్ లో వైట్ వాష్ కు గురైంది. రోహిత్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తోంది. ఇలాంటి క్రమంలో న్యూజిలాండ్ జట్టును 3-0 తేడాతో ఓడించడం పెద్ద కష్టం కాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.