Team India T20 Captaincy: అదిగో పులి.. ఇదిగో తోక.. ఇలానే సాగిపోతుంది టీమిండియాలో.. టి20 ఫార్మాట్లో టీమ్ ఇండియాకు తిరుగులేదు. ఆ విభాగంలో టీమిండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది. పైగా ఇటీవల టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. దీంతో టీమిండియా మీద అందరి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
సాధారణంగా ఒక జట్టు మీద అంచనాలు పెరిగిపోతే.. ఆ తర్వాత ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన మీద చర్చ మొదలవుతుంది. ఆటగాళ్లు బాగా ఆడితే పెద్దగా ఇబ్బంది ఉండదు. తేడాగా ఆడితేనే మొత్తం తేడా కొట్టేస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిని టీమిండియా వైల్డ్ ఫైర్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ఎదుర్కొంటున్నాడు. అతడు టి20 జట్టుకు నాయకత్వం వహించిన నాటి నుంచి ఇప్పటివరకు టీమిండియా ఒక సిరీస్ కూడా కోల్పోలేదు. ఆటగాడిగా విఫలమైనప్పటికీ నాయకుడిగా జట్టును అద్భుతమైన దిశలో నడిపించాడు.
సూర్య కుమార్ యాదవ్ వ్యక్తిగత ప్రదర్శన సరిగా లేకపోవడంతో ఆయనను పక్కన పెట్టాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్టు ఆ మధ్య జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు అవకాశం కల్పిస్తారని ప్రచారం జోరుగా మొదలైంది. జాతీయ మీడియాలో కూడా ఈ తరహా వార్తలు రావడంతో అందరూ దాదాపు నిజమే అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అయ్యర్ కూడా కాదని తెలిసిపోయింది.
పంజాబ్ జట్టును అయ్యర్ ఐపిఎల్ లో అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడు. ఎక్కడో మూలన ఉండే పంజాబ్ జట్టును గత సీజన్లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఈ సీజన్లో కూడా దాదాపు ఫైనల్ దాకా తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడి వ్యక్తిగత ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంది. నేపథ్యంలో అయ్యర్ చేతిలో టి20 జట్టును పెడితే బాగుంటుంది అని భారత క్రికెట్ పెద్దలు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు అయ్యర్ కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ లో అదరగొడుతున్న సంజు శాంసన్ కు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. టి20 వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు సంజు. ప్రస్తుతం చెన్నై జట్టులో దుమ్ము రేపే రేంజ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే అతని ఖాతాలో రెండు సెంచరీలు ఉన్నాయి. పైగా భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడికి టి20 జట్టు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ ను పక్కనపెట్టారు. చివరికి అయ్యర్ ను కూడా పక్కన పెట్టారు. ఇప్పుడు సంజూను తీసుకొచ్చారు. ఆ తర్వాత వంతు ఎవరిదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.