Ishan Kishan: టీమిండియాలో ప్రస్తుతం అభిషేక్ శర్మ గురించి చర్చ జరగడం లేదు. తిలక్ వర్మ గురించి ప్రస్తావన ఉండడం లేదు. సూర్య కుమార్ గురించి మాట్లాడుతున్నప్పటికీ.. అది ఒక స్థాయి వరకు మాత్రమే పరిమితమవుతోంది. ఒక ఆటగాడి గురించి మాత్రం ప్రధాన మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు రకరకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి.
నిన్నటి వరకు అతడు కేవలం ఒక సాధారణ ఆటగాడు మాత్రమే. అది కూడా జట్టులో చోటు కోల్పోయి.. డొమెస్టిక్ క్రికెట్లో ఆడుతూ.. పెద్దగా ప్రచారంలో ఉండేవాడు కాదు.
ఎప్పుడైతే డొమెస్టిక్ క్రికెట్లో జార్ఖండ్ జట్టును విజేతగా నిలిపాడో .. అప్పుడే పరిస్థితి మారిపోయింది. జాతీయ జట్టులో అతడికి చోటు లభించింది. అప్పటినుంచి అతడు అదరగొడుతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్లో దుమ్ము రేపిన అతడు.. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో సంచలన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఇంత చదివిన తర్వాత అతడు ఎవరో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా..
టీమిండియాలో మిస్టర్ 360గా పేరు పొందాడు సూర్య కుమార్ యాదవ్. ఇప్పుడు అతడిని మించి స్థాయిలో ఆడుతున్నాడు ఇషాన్ కిషన్. 2026లో ఇప్పటివరకు ఇషాన్ కిషన్ 373 పరుగులు చేశాడు. దీనిని బట్టి అతడు ఏ స్థాయిలో ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. సూర్య కుమార్ యాదవ్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 370 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ కంటే కూడా మూడు పరుగులు ఎక్కువ చేసి లీడ్ లో కొనసాగుతున్నాడు ఇషాన్ కిషన్.
ఇషాన్ కిషన్ ఈ స్థాయిలో ఆడుతున్న నేపథ్యంలో అతడిని అభిమానులు డైనమో అని పిలుస్తున్నారు. . ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో ఇషాన్ కిషన్ నమీబియా జట్టుతో జరిగిన మ్యాచ్లో 61 పరుగులు చేశాడు. అమెరికా జట్టుతో జరిగిన మ్యాచ్లో 20 పరుగులు చేశాడు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అయితే 27 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. వేగంగా ఆడే క్రమంలో ఔట్ అయ్యాడు. ఒకవేళ అతడు అదే జోరు కొనసాగిస్తే సెంచరీ చేసేవాడు.