Homeక్రీడలుక్రికెట్‌T20 World Cup India Vs Pakistan 2026: మన క్రికెట్ మనుగడకు పాకిస్థానే దిక్కా?...

T20 World Cup India Vs Pakistan 2026: మన క్రికెట్ మనుగడకు పాకిస్థానే దిక్కా? జై షా అలా మార్చేశాడా?

T20 World Cup India Vs Pakistan 2026: మనకు ఇప్పటి క్రికెట్లో బలమైన ప్రత్యర్థి అంటే ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికా.. అరుదైన సందర్భాలలో ఇంగ్లాండ్ లేదా న్యూజిలాండ్.. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాను సైతం ఓడించి.. మనవాళ్లు రికార్డులు సృష్టిస్తున్నారు.. పాకిస్తాన్ మీద అయితే ఏకపక్షంగా విజయాలు సాధిస్తున్నారు. అలాంటప్పుడు పాకిస్తాన్ మనకు బలమైన ప్రత్యర్థి ఎలా అవుతుందో క్రికెట్ పెద్దలకే తెలియాలి.

టి20 వరల్డ్ కప్ లో ఆడబోమని పాకిస్తాన్ చెప్పినప్పుడు సాధ్యమైనంత వరకు దీనిని సులభంగా తీసుకోవాలి ఐసిసి. కానీ ఐసీసీ పెద్దగా ఉన్న జై షా మాత్రం డబ్బులకే లొంగిపోయాడు. ఈ మాట అనడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అసలు జై షా క్రికెటర్ కాదు. క్రికెట్ ఆడిన అనుభవం కూడా లేదు. అతడు కేవలం ఒక ఫండ్ మేనేజర్ మాత్రమే. మనదేశంలో ఎన్నో ఎన్నో పదవుల్లో సంబంధం లేని వ్యక్తులు ఉన్నారు. అందులో జై షా కూడా ఒకడు. తన తండ్రి మాదిరిగా ఇతడిలో చాణక్యం లేదు. రాజనీతి కనిపించడం లేదు. కేవలం డబ్బు.. హంగులు మాత్రమే ఇతడిని ఆకర్షిస్తున్నాయి. ఆదే దిశగా నడిపిస్తున్నాయి.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ధోరణి పాకిస్తాన్ విషయంలో పూర్తిగా మారిపోయింది. కానీ అది కొన్ని విషయాలకు మాత్రమే పరిమితమైంది. క్రికెట్లో విధించుకున్న నిబంధన సడలిపోయింది. జై షా నిర్వాకం వల్ల పాకిస్తాన్ జట్టు క్రికెట్ ఆడకపోతే మనదేశంలో ఆ ఆటకు మనుగడ లేదు అన్నట్టుగా జై షా సూత్రీకరణ జరిగిపోయింది. పాకిస్తాన్ మనతో ఆడకపోతే పీసీబీతో చర్చలు ఎందుకు జరపాలి? జియో హాట్ స్టార్ కు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఐసిసి అధినేతగా జై షా పరోక్షంగా శ్రీలంక క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును రంగంలోకి దింపాడు. లెటర్లు రాయించాడు. చివరికి ఏదో విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఒప్పించాడు. అంతేకాదు జియో హాట్ స్టార్ కు డబ్బులు కట్టకుండానే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఒప్పించామని అనుకూల మీడియాలో జై షా డబ్బాలు కొట్టించుకుంటున్నాడు.

వాడెవడో బంగ్లాదేశ్ క్రికెటర్ ఐపిఎల్ లో ఆడొద్దని బీసీసీఐ నిర్ణయించుకుంది. వాడిని మొహమాటం లేకుండా పక్కన పెట్టింది. ఈ వ్యవహారం ఒక ఆటగాడికి.. ఒక క్రికెట్ మండలికి సంబంధించింది. మధ్యలో పాకిస్తాన్ వాడు ఎంట్రీ ఇచ్చాడు.. అసలు బంగ్లాదేశ్ కు, పాకిస్తాన్ కు ఎటువంటి సంబంధం లేదు. ఈ దేశాల మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ భారత్ బహిష్కరించడంతో బంగ్లాదేశ్ ఆటగాడికి పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చింది. గతంలో బంగ్లాదేశ్ వాళ్లను పాకిస్తాన్ ఉక్కుపాదంతో తొక్కేసింది. ఆ విషయాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ మర్చిపోయింది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ ఎదుట ప్రస్తావిస్తే లైట్ తీసుకుంటుంది.

సో కాల్డ్ కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి జై షా ముందుకు వచ్చాడు కానీ.. ఇవాల్టికి కూడా ఆసియా కప్ లో తమ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని పాకిస్తాన్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు నఖ్వీ టీమిండియా కు ట్రోఫీ పంపించలేదు. ఈ విషయంపై జై షా స్పందించడు. ఓ పని చేయ్ జై షా.. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ కూల్చేయి. బంగ్లాదేశ్ లో అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ పెట్టేసేయ్. బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్ తో ట్రై సిరీస్ నిర్వహించు. పనిలో పనిగా గుంపగుత్తగా అంబానీ జియో హాట్ స్టార్ కు బ్రాడ్ కాస్టింగ్ హక్కులు ఇచ్చేసేయ్. మరొకసారి ఐసీసీ చైర్మన్ పదవి స్వీకరించి.. దానిని పూర్తిగా కార్పొరేట్ మయం చేసేయ్..

చివరిగా పహల్గాం దాడిలో ఏం జరిగిందో తెలుసా? ఏం చూసి వారిని చంపారో తెలుసా? మొన్నటికి మొన్న మన సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేయడానికి ఎటువంటి కసరత్తు చేశారో తెలుసా? దీనికోసం భారత్ ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా? ఇవన్నీ తెలిస్తే నువ్వు పాక్ తో క్రికెట్ ఆడాలని కోరుకోవు.. జై షా

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version