Team India India vs Pakistan : టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా కొలంబోలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు మీద అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయం ద్వారా టీమ్ ఇండియా సూపర్ 8 లోకి వెళ్లిపోయింది. లీగ్ సమరం దాదాపుగా ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో.. సూపర్ 8 కు వెళ్లే జట్లు ఏవో ఒక స్పష్టత వచ్చింది.
టి20 వరల్డ్ కప్ లో టీమిండియా సూపర్ 8 దశలో తలపడబోయే జట్ల మీద ఒక క్లారిటీ వచ్చింది. భారత్ ఇప్పటికే సూపర్ 8 దశకు అర్హత సాధించింది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఒకే గ్రూపులో ఉండే అవకాశం ఉంది. మరొక స్థానం కోసం ఆస్ట్రేలియా, జింబాబ్వే పోటీ పడతాయి. ఒకవేళ ఆస్ట్రేలియా ఈ గ్రూపులోకి వస్తే పోటీ కఠినంగా మారే అవకాశం ఉంది. భారత్ ఫిబ్రవరి 22న సౌత్ ఆఫ్రికా తో తలపడుతుంది. ఫిబ్రవరి 26న ఆస్ట్రేలియా లేదా జింబాబ్వేతో పోటీ పడుతుంది. మార్చి 1న వెస్టిండీస్ తో భారత్ ఆడుతుంది.
ఇక గ్రూప్ 2 లో శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తలపడే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికా ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో భీకరమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. గత ఏడాది జరిగిన టి20 సిరీస్లో టీమిండియా దక్షిణాఫ్రికా మీద గెలిచినప్పటికీ.. ఆ జట్టు భారత బృందానికి తీవ్ర పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికా మీద గెలవాలంటే తీవ్రంగా ప్రయత్నించాలి. ఆస్ట్రేలియా ఒకవేళ సూపర్ 8 లోకి వస్తే ఫిబ్రవరి 26న.. కంగారు జట్టుతో టీమిండియా పోటీ పడాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్లు ముగిసిన తర్వాత వెస్టిండీస్ జట్టుతో భారత జట్టు తలపడాల్సి ఉంటుంది
ఇలా ఏ రకంగా చూసినా టీమిడియాకు సూపర్ 8 దశ అనేది అత్యంత కఠినంగా ఉంది. సౌత్ ఆఫ్రికా జోరు మీద ఉంది. ఆస్ట్రేలియా జింబాబ్వే చేతిలో ఓడిపోయినంత మాత్రాన ఆ జట్టును తక్కువ చేసి చూడడానికి లేదు. వెస్టిండీస్ కూడా బీభత్సంగానే ఆడుతోంది. ఆ జట్టులో బౌలర్లతోపాటు.. బ్యాటర్లు కూడా సత్తా చూపిస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ 8 లో టీమిండియా అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది.
అమెరికాతో.. నమిబియాతో జరిగిన మ్యాచ్లలో టీమిండియా కాస్త ఇబ్బంది పడింది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో లోపాలను సవరించుకొని.. టీమిండియా బలంగా సూపర్ 8 లో ఆడాల్సి ఉంటుంది.