Suryakumar Yadav Removed As T20 Captain: టీమ్ ఇండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు ఉద్వాసన పలుకుతున్నారా.. అతడి స్థానంలో వేరే ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించబోతున్నారా.. మేనేజ్మెంట్ ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసిందా.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందా.. ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఎందుకంటే కేవలం రెండు రోజుల్లోనే టీమిండియా టి20 కెప్టెన్ విషయంలో ఒక కీలక ప్రకటన వస్తుందని వారు వివరిస్తున్నారు.
టీమిండియా తదుపరి ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో టి20 సిరీస్ మాత్రమే కాకుండా ఆసియా గేమ్స్ లో కూడా రంగంలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు సిరీస్లలో ఆడే జట్టు వివరాలను మేనేజ్మెంట్ ప్రకటించబోతోంది. టి20 జట్టు లో సారథిగా సూర్య అదరగొట్టాడు. ఆటగాడిగా అతడు అంతగా ప్రభావం చూపించలేదు. అయితే భవిష్యత్తు లక్ష్యాలు వేరే విధంగా ఉండడంతో మేనేజ్మెంట్ కొత్త కెప్టెన్ వైపు దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది.
కొత్త సారథిగా అతడే
టి20 ప్రపంచ కప్ లో భారత జట్టును సూర్య కుమార్ యాదవ్ ముందుకు నడిపించాడు. ఏకంగా వరల్డ్ కప్ అందించాడు. ఐపీఎల్ లో ముంబై జట్టు తరఫున ఆడాడు. కానీ స్థిరమైన ఆట తీరు కొనసాగించడం విఫలమయ్యాడు. 2028లో టి20 ప్రపంచ కప్.. లాస్ ఏంజిల్స్ వేదికగా ఒలంపిక్స్ జరుగుతాయి.. ఈ టోర్నీల కోసం జట్టును సిద్ధం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. కొత్త సారధిగా పంజాబ్ జట్టు కెప్టెన్ అయ్యర్ కు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే అతడు మాత్రమే కాకుండా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి వారు కూడా కెప్టెన్ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గంభీర్, సెలెక్టర్ల మధ్య కెప్టెన్ విషయంలో ఇంకా క్లారిటీ లేదని తెలుస్తోంది.
ఆసియా క్రీడలకు సంబంధించి ఇప్పటికే కొంతమంది ప్లేయర్లను బీసీసీఐ ప్రకటించింది. అందులో సూర్య, గిల్ కు అవకాశం లభించలేదు. వెస్టిండీస్ జట్టుతో జరిగే సిరీస్, 2028లో జరిగే ఒలంపిక్ గేమ్స్, టి20 వరల్డ్ కప్ వంటి టోర్నీలు ఉన్న నేపథ్యంలో.. సూర్య కుమార్ యాదవ్ ను ఆసియా గేమ్స్ కు ఎంపిక చేయలేదని తెలుస్తోంది.
ఒకవేళ కొత్త కెప్టెన్ ను ఇప్పుడు నియమిస్తే కేవలం ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో జరిగే సిరీస్ లకు మాత్రమేనా.. భవిష్యత్తు టోర్నీలకు కూడా ఉంటుందా అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభించబోతుంది. ఆసియా క్రీడల కోసం పంపే భారత జట్టులో సీనియర్లు ఆడబోరని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే పొట్టి సిరీస్ కు మాత్రమే పూర్తిస్థాయిలో జట్టు వెళ్తుంది. అదే సూర్య స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరో త్వరలో తేలిపోతుంది.
సూర్య కుమార్ యాదవ్ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ లలో టి20 జట్టులో సూర్య వంశీ కి చోటు లభించే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది.. సూర్య వంశీ ఐపీఎల్ లో అదరగొట్టాడు. అన్ని వ్యక్తిగత ట్రోఫీలను సొంతం చేసుకున్నాడు. అతడికి ఈ సిరీస్లలో అవకాశం ఇవ్వాలని చాలామంది కోరుతున్నారు. బీసీసీఐ కూడా సానుకూల ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అతడు గనుక అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశిస్తే సచిన్ రికార్డును బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
టీమిండియా ఈనెల 26 నుంచి 25 వరకు ఐర్లాండ్ జట్టుతో రెండు టీ20 లను ఆడుతుంది.
వచ్చేనెల 1వ తేదీ నుంచి 19 వరకు ఇంగ్లాండ్ లో ఇండియా పర్యటిస్తోంది. ఐదు టి 20 మ్యాచ్లు ఆడుతుంది.
వచ్చేనెల 23 నుంచి 26 వరకు జింబాబ్వే తో మూడు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది.
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఆసియా గేమ్స్ జరుగుతాయి. ఇందులో టీమ్ ఇండియా ఆడుతుంది.
