Suryakumar Yadav: టీమిండియాలో ముఖ్యంగా టి20 ఫార్మాట్లో భీకరమైన ప్లేయర్లుగా పేరుపొందారు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. 2024లో టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించడంలో హార్థిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ ముఖ్యపాత్రలు పోషించారు. టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత.. రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుతున్నాడు. అతడి స్థానంలో హార్దిక్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ఏం జరిగిందో తెలియదు.. హఠాత్తుగా సూర్య కుమార్ యాదవ్ టీమిండియా కు కెప్టెన్ అయ్యాడు.
సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా 2024 నుంచి 2026 ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. ప్రస్తుతం టీమిండియా పొట్టి ఫార్మాట్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే త్వరలో జరిగే ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఆసియా గేమ్స్ కోసం ప్రకటించిన భారత జట్టులో సూర్య కుమార్ యాదవ్ కు చోటు దక్కలేదు. అలాగని హార్దిక్ పాండ్యాకు కూడా నాయకత్వ బాధ్యతలు అప్పగించలేదు. అతడిని ఆటగాడిగా కూడా ఎంపిక చేయలేదు.
వీరిద్దరిని ఎంపిక చేయకపోవడం పట్ల రకరకాల వార్తలు వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా వీరిద్దరి వ్యవహారంలో జాతీయ మీడియా ఒక సంచలనాత్మక కథనాన్ని ప్రసారం చేసింది.. 2024 నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి రోహిత్ అనంతరం హార్దిక్ కెప్టెన్ అవుతారని భావించారు. అయితే సూర్యకు గంభీర్ నుంచి విపరీతమైన మద్దతు ఉండడంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాలేకపోయాడు. దీనికి తోడు జాతీయ జట్టులో ఉన్న ఒక ఆటగాడు కూడా సూర్య విషయంలో సానుకూలంగా స్పందించడంతో మేనేజ్మెంట్ అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అప్పటినుంచి డ్రెస్సింగ్ రూమ్ లో ఇద్దరికీ పెద్దగా సానుకూలమైన సంబంధాలు లేవని సమాచారం.
ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నప్పుడు వీరిద్దరు కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగానే వ్యవహరించే వాళ్ళని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లలో మెజారిటీ ప్లేయర్లు సరిగా ఆడలేదు. అందువల్లే ఆ జట్టు 2024 నుంచి ఈ సీజన్ వరకు అంతగా ప్రతిభ చూపలేదు. దీంతో హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు నుంచి పక్కకు తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
లక్నో లేదా మరో జట్టుకు అతడు నాయకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే త్వరలో జరగబోయే టోర్నీలలో వీరిద్దరికీ మేనేజ్మెంట్ అవకాశాలు కల్పించలేదు. వీరిద్దరి మధ్య జరుగుతున్న గొడవ మేనేజ్మెంట్ దాకా వెళ్ళినట్టుంది.. అందువల్లే అవకాశాలు ఇవ్వలేదని స్పోర్ట్స్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు హార్దిక్ పాండ్యా ప్రస్తుతం విహారయాత్రలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ముంబై t20 లీగ్ లో ఆడుతున్నాడు.
