T20 World Cup : ద్వైపాక్షిక సిరీస్ లు ఎన్ని ఆడినా.. ఎన్ని గెలిచినా.. వరల్డ్ కప్ తో వచ్చే కిక్కే వేరు. ఆ కప్పు గెలిస్తే పొందే ఆనందమే వేరు. అందుకే.. ప్రపంచకప్ సాధించడమే లక్ష్యంగా ఆడుతుంటాయి అన్ని దేశాలూ. ఇలాంటి మెగాటోర్నీకి సర్వం సిద్ధమవుతోంది. దుబాయ్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటికే పలు జట్లు తమ టీమ్ లను కూడా ప్రకటించాయి. త్వరలో భారత జట్టును కూడా బీసీసీఐ ప్రకటించబోతోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ గవాస్కర్ జట్టును సెలక్ట్ చేశారు. తన అనుభవంతో ఎవరు జట్టులో ఉంటే బాగుంటుందో ప్రకటించారు. మరి, అందులో ఎవరికి చోటు దక్కింది? ఎవరు ఏ ప్లేసులో ఆడబోతున్నారు? అన్నది చూద్దాం.
గవాస్కర్ తన జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ కు చోటు ఇవ్వలేదు. అదే సమయంలో మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ను కూడా పక్కన పెట్టాడు. ఇటీవల శ్రీలంక వెళ్లిన జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే.. అక్కడ ధావన్ సత్తా చాటలేకపోయాడు. దీంతో.. ఈ ప్రభావం ప్రపంచకప్ సెలక్షన్ పై పడుతుందా? అనే సందేహం వ్యక్తమవుతూనే ఉంది. ఇప్పుడు.. గవాస్కర్ ధావన్ కు చోటు లభించకపోవచ్చు అని జోస్యం చెప్పడం గమనార్హం. ఇక, శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
ఇక, రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తారని అనౌన్స్ చేశాడు. ఇందులో కొత్త విషయం ఏమీ లేదు. ఐదో బౌలర్ ను ఆడించాలనే వ్యూహంలో భాగంగా.. తాను ఓపెనింగ్ చేస్తానని విరాట్ ఎప్పడో ప్రకటించాడు. ఇదే విషయాన్ని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత.. సూర్యకుమార్ యాదవ్ ను ఫస్ట్ డౌన్ గా ప్రకటించాడు. కేఎల్రాహుల్, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజాలను వరుసగా అనౌన్స్ చేశాడు.
బౌలింగ్ విభాగానికి వస్తే.. షమీ, భువనేశ్వర్, బుమ్రా బాగుంటుందని చెప్పాడు. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ లు ఆల్ రౌండర్ కోటాలో జట్టులో ఉండాలని గవాస్కర్ ప్రకటించాడు. రవిచంద్రన్ అశ్విన్ కు మాత్రం మొండిచేయి చూపించాడు. ఇదిలాఉంటే.. గాయపడిన వాషింగ్టన్ సుందర్ కు చోటివ్వడం విశేషం. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ప్రపంచకప్ టోర్నీ సాగనుంది.
గవాస్కర్ జట్టును చూస్తే.. రోహిత్ శర్మ, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, షమీ, భువనేశ్వర్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, యుజేంద్ర చాహల్.