కరోనా కల్లోలంలో ఆటలు అన్నీ బంద్ అయ్యాయి. క్రీడలు టీవీల్లో చూద్దామన్నా ఎక్కడా సాగడం లేదు. ఈ క్రమంలోనే చాలా రోజుల గ్యాప్ తర్వాత భారత్-శ్రీలంక వన్డే సిరీస్ మొదలైంది. మరికాసేపట్లో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టీమిండియా పెద్ద టీం ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. రెండో టీం రాహుల్ ద్రావిడ్ కోచింగ్ సారథ్యంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో శ్రీలంకలో పర్యటిస్తోంది.
చాలా రోజులుగా మ్యాచ్ లు లేకపోవడంతో అభిమానులు నిరాశగా ఉన్న వేళ ఈ ఆదివారం పూట భారత్-శ్రీలంక మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తొలి వన్డే జరుగనున్న ప్రేమదాస స్టేడియంలో ఆదివారం వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపడంతో భారత అభిమానులు షాక్ అవుతున్నారు. ఎన్నో రోజుల తర్వాత క్రికెట్ చూద్దామంటే ఈ వర్షం అంతరాయం కలిగిస్తోందని మథన పడుతున్నారు.
ప్రస్తుతం భారత్-శ్రీలంక మ్యాచ్ జరిగే కొలొంబోలో ఆకాశం మేఘావృతమైంది. మైదానం చుట్టూ నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని చెబుతున్నారు.
ఇప్పటికే ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో వర్షం భారత్ ను దెబ్బకొట్టి న్యూజిలాండ్ విజయానికి కారణమైంది. ఇప్పుడు శ్రీలంకలోనూ అదే వరుణుడు భారత్ ను దెబ్బతీస్తాడా? లేదా అన్నది వేచిచూడాలి.