Sanju Samson Kerala Elections: కేరళ రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయింది. అక్కడ ప్రచారపర్వం జోరుగా సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. విజయం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
కేరళ రాష్ట్రంలో ఇంతవరకు బిజెపి అధికారంలోకి రాకపోయింది. అక్కడ కాంగ్రెస్ కూటమి లేదా వామపక్షాల కూటమి మాత్రమే ఇప్పటివరకు విజయం సాధించుకుంటూ వస్తోంది. అయితే కేరళ రాష్ట్రంలో గత పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ప్రభావం చూపించగలిగింది. స్థానిక ఎన్నికల్లో కూడా సత్తా చూపించగలిగింది. దీంతో కేరళ రాష్ట్రంలో జరిగే ఎన్నికలపై ఈసారి బిజెపి దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ ఈసారి రాజకీయాలను కాకుండా.. క్రికెటర్ సంజు శాంసన్ ను ఎంచుకున్నారు.. టి20 ప్రపంచ కప్ లో భారత్ విజేతగా నిలవడానికి సంజు ముఖ్యపాత్ర పోషించాలని నరేంద్ర మోడీ అభినందించారు.. “ఈరోజు క్రికెట్ సీజన్ సాగుతోంది. కేరళ ప్రజలు నేర్చుకోవడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటారు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో సంజు ఎలా ఆడాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టోర్నమెంట్ సంక్షోభ స్థితిలో ఉన్నప్పుడు అతడు నిలబడ్డాడు. అతని ప్రదర్శన అకస్మాత్తుగా శిఖరాగ్రానికి చేరుకుంది. మొదటినుంచి చివరి వరకు అతని దృష్టి, విశ్వాసం, తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇది నిజమైన ఆటగాడికి ఉండాల్సిన కనీస లక్షణం అని” ప్రధాని వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవల టి20 వరల్డ్ కప్ లో సంజు శాంసన్ ఐదు ఇన్నింగ్స్ లలో 80.25 సగటుతో 321 పరుగులు చేశాడు. ఇందులో 27 ఫోర్లు.. 24 సిక్సర్లు ఉన్నాయి. టి20 వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా నిలిచాడు.. వెస్టిండీస్ జట్టుపై 97*, ఇంగ్లాండ్ పై 89, న్యూజిలాండ్ పై 89 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
సంజు శాంసన్ గురించి ప్రధాని ఇప్పుడు చెప్పడానికి బలమైన కారణం ఉంది. కేరళ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ప్రజలు క్రికెట్ ను విపరీతంగా చూస్తారు. పైగా వారికి స్వాభిమానం ఎక్కువగా ఉంటుంది. దానిని తట్టి లేపేందుకు ప్రధానమంత్రి సంజు శాంసన్ ను అస్త్రంగా వాడుకున్నట్టు తెలుస్తోంది.
