Rishabh Pant: 27 కోట్లు.. అక్షరాల 27 కోట్లు.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక అమౌంట్. అంతటి నగదు పెట్టి కొనుగోలు చేస్తే.. అతడు ఆడింది లేదు. జట్టును గెలిపించింది లేదు. కనీసం ప్లే ఆఫ్ దాకా తీసుకెళ్ళింది కూడా లేదు. గత ఏడాది దారుణంగా ఉందనుకుంటే.. ఈ ఏడాది ప్రారంభమే అంతకంటే దరిద్రంగా సాగింది. దీంతో అతడి గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. సారధిగా అతనిని కొనసాగించడం కష్టమేనని.. కనీసం ఆటగాడిగానైనా అతడిని జట్టులో ఉంచుతారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లక్నో జట్టకు కేఎల్ రాహుల్ 2024లో సారధిగా ఉన్నాడు. నాడు లక్నో జట్టు హైదరాబాద్ చేతిలో దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది. ఆ ఓటమి నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ రాహుల్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైదానంలోనే మండిపడ్డాడు. అందరూ చూస్తుండగా రాహుల్ మీద అసహనం వ్యక్తం చేశాడు. ఒకరకంగా ఇది అప్పట్లో సంచలనం కలిగించింది. పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఆత్మాభిమానం ఎక్కువగా ఉండే రాహుల్ సంజీవ్ ప్రవర్తన పట్ల ఇబ్బంది పడ్డాడు. ఆ సీజన్ నుంచి తప్పుకున్నాడు. వెంటనే ఢిల్లీ జట్టుకు మారిపోయాడు. ఢిల్లీ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.. రాహుల్ లక్నో జట్టు నుంచి వెళ్ళిపోయిన తర్వాత.. రిషబ్ పంత్ ను సంజీవ్ ఏరి కోరి తీసుకున్నాడు. జట్టుకు నాయకుడిగా చేశాడు. ఏకంగా 27 కోట్లు చెల్లించాడు. ఇంత ధర తీసుకుంటున్నప్పటికీ.. ఆ పాత్రకు పంత్ న్యాయం చేయలేకపోతున్నాడు. గత సీజన్లో దారుణంగా ఆడాడు. ఇప్పుడేమో అంతకుమించి అనే స్థాయిలో తన వైఫల్యాన్ని చాటుకుంటున్నాడు…
Also Read: బౌలింగ్ మారకపోతే… సన్ రైజర్స్ కు కష్టమే
బ్యాటింగ్లో ఒకప్పటి లయను అందించలేకపోతున్నాడు. బౌలింగ్లో కూడా సరైన కూర్పు లేకపోవడంతో లక్నో జట్టు పరువు పోతోంది. వాస్తవానికి ఐపీఎల్లో లక్నో జట్టు తొలి మూడు సీజన్లలో ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది. కానీ ఇప్పుడు అంతటి స్థాయికి వెళ్లే విధంగా కనిపించడం లేదు. జట్టులో అనుభవం ఉన్న ప్లేయర్లు.. యువ ఆటగాళ్లు ఉన్నారు. వారంతా కూడా జట్టు విజయానికి బాటలు వేస్తారనుకుంటుంటే.. కీలక దశలో ఔట్ అయి పరువు తీసుకుంటున్నారు. బ్యాటింగ్లో సత్తా చూపించడం లేదు. బౌలింగ్లో అదరగొట్టడం లేదు. ఫీల్డింగ్ లో మెరుపులు మెరూపించడం లేదు. ఇలా అయితే లక్నో జట్టు ఐపిఎల్ ట్రోఫీ గెలవడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
పంత్ గత ఏడాదిగా అంతర్జాతీయ టి20 ఆడలేదు. వాస్తవానికి అతడిలో అద్భుతమైన టెక్నిక్ ఉంటుంది. బంతిని బలంగా కొట్టే సత్తా ఉంటుంది. అన్నిటికి మించి వేగంగా పరుగులు తీసే సామర్థ్యం ఉంటుంది. ఇన్ని ఉన్నప్పటికీ అతడు సరిగ్గా ఆడ లేకపోతున్నాడు. అందువల్లే అతడి తీరు పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంత్ సరైన స్థాయిలో ఆడాలని .. జట్టును అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని లక్నో అభిమానులు కోరుకుంటున్నారు.
