Jasprit Bumrah
Jasprit Bumrah: ఇండియాలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పర్యటన కొనసాగుతోంది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి రెండు టెస్టులు తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి. మొదటిది హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగగా, ఇందులో టీమిండియా ఓడిపోయింది. ఇక ఏపీలోని విశాఖ వైఎస్సార్ స్టేడియంలో రెండో టెస్టు జరిగింది. ఇందెలో ఇంగ్లండ్ను భారత్ చిత్తు చేసి సిరీస్ను 1–1తో సమం చేసింది. మూడో టెస్ట్ ఫిబ్రవరి 15న రాజ్కోట్ వేదికగా జరుగనుంది. అయితే బీసీసీఐ మొదటి రెండు టెస్టులకే జట్టును ఎంపిక చేసింది. మిగతా మూడు టెస్టుల నేడో రేపో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే మిగత టెస్టులు ఆడే భారత జట్టు నుంచి కీలక ఆటగాడిని తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈమేరకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీసీసీఐ తలతిక్క నిర్ణయంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
బుమ్రాకు విశ్రాంతి?
రెండో టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన వెనుక ప్రధాన అస్త్రం జస్ప్రీత్ బుమ్రా. స్పిన్కు అనుకూలించే పిచ్పై 9 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ ఓటమిని శాసించాడు. బుమ్రా బంతులను ఎదుర్కొనలేక ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మెన్లు సైతం చేతులు ఎత్తేశారు. బుమ్రా ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఇంతటి కీ ప్లేయర్ను మూడో టెస్టుమ్యాచ్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు, ఐదో టెస్టులకు తిరిగి జట్టులో చేరతాడని సమాచారం. ఈమేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రిఫ్రెష్ కోసమే..
బుమ్రా రెండో టెస్టులో 32 ఓవర్లు వేశాడు. అయితే చివరి రోజు బౌలింగ్లో ఎనర్జీ తగ్గినట్లు క నిపించాడు. దీంతో బుమ్రా రిఫ్రెష్, రీచార్జ్ కోసమే సెలక్టర్లు మూడో టెస్టులో అతనికి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి టెస్టులో విఫలమైన మహ్మద్ సిరాజ్కు రెండో టెస్టులో సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇతడిని మూడో టెస్టుకు ఎంపిక చేసి బుమ్రాకు రెస్ట్ ఇస్తారని తెలుస్తోంది.
ఫ్యాన్స్ ఫైర్..
అయితే బీసీసీఐ నిర్ణయంపై టీమిండయా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మూడో టెస్టు జరగడానికి పది రోజుల సమయం ఉంది. ఆటగాళ్లకు మంచి విశ్రాంతి దొరుకుతుంది. అయినా బీసీసీఐ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయిచండంపై ఫ్యాన్స్ మండి పడుతున్నారు. గెలుపు గుర్రాన్ని పక్కన పెడితే టీమిండియాకు నష్టం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మహ్మద్ షమీ, జడేజా జట్టుకు అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో బుమ్రాను పక్కన పెట్టడం సరికాదని సూచిస్తున్నారు.