RCB vs CSK : బెంగళూరు చేతిలో ఉన్నది ఆ ఒక్క ఆయుధమే..

ఐపీఎల్ నిబంధనలు ప్రకారం ఎంపైర్లు ఇరుజట్లకు చెరో పాయింట్ ఇస్తారు. దీనివల్ల చెన్నై ప్లే ఆఫ్ వెళ్తుంది. బెంగళూరు లీగ్ దశలోనే నిష్క్రమిస్తుంది.

Written By: NARESH, Updated On : May 18, 2024 8:44 pm

SRH vs CSK

Follow us on

RCB vs CSK : ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి చెన్నై, బెంగళూరుది. ఈ నేపథ్యంలో శనివారం చిన్న స్వామి స్టేడియంలో హై వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం నుంచి వర్షం లేదు, మ్యాచ్ కొనసాగుతుందని భావించిన అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతున్నాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ వెళ్లాలని భావిస్తున్న బెంగళూరు జట్టు ఆశలను అడియాశలు చేస్తున్నాడు. సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు అంపైర్ టాస్ వేశాడు. చెన్నై కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ టాస్ గెలిచాడు. రెండవ మాటకు తావు లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ కు దిగింది. తొలి ఓవర్లో తుషార్ దేశ్ పాండే రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ వేయగా.. బెంగళూరు బ్యాటర్లు విరాట్ కోహ్లీ, డూ ప్లెసిస్ దంచి కొట్టారు. ఆ ఓవర్లో ఏకంగా 1, 4, 1, 0, 4, 6 పరుగులు పిండుకున్నారు.. ఆ తర్వాత తుషార్ దేశ్ పాండే బౌలింగ్లో 6, 0, 6, 0, 0, 1 పరుగులు సాధించారు. అప్పటికి మూడు ఓవర్లు పూర్తయ్యాయి. క్రికెట్ నష్టపోకుండా బెంగళూరు 31 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ నిలిపివేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.. విరాట్ కోహ్లీ 9 బంతుల్లో 19*(ఒక ఫోర్, రెండు సిక్స్ లు), డూ ప్లెసిస్ 9 బంతుల్లో 12( ఒక ఫోర్, ఒక సిక్స్) తో క్రీజు లో ఉన్నారు. వర్షం ఎంత మాత్రం తగ్గకపోవడంతో బెంగళూరు ఆటగాళ్లు నిరాశలో మునిగిపోయారు.. ఆ జట్టు అభిమానులు వరుణ దేవుడిని తిడుతున్నారు. ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దు అయితే బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ వెళ్లడం దాదాపు కష్టం. ఎందుకంటే నెట్ రన్ రేట్ విషయంలో బెంగళూరు కంటే చెన్నై ముందంజలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బెంగళూరు చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం సబ్ ఎయిర్ సిస్టం..

విపరీతంగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియాన్ని పొడిగా చేసేందుకు సబ్ ఎయిర్ సిస్టంను ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. తొలిసారిగా 2015లో భారత్ – దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ కోసం ఈ పద్ధతిని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తెరపైకి తీసుకువచ్చింది. ఈ పద్ధతి ప్రకారం పిచ్ తో పాటు, మైదానంపై వివిధ లేయర్లలో ఇసుకను వాడింది.. ఇసుక ఉండడం వల్ల వర్షపు నీరు మైదానంలో ఇంకదు. మిషన్ స్టార్ట్ చేయగానే నీరు మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఈ నీరును మొత్తం తోడేందుకు 200 హార్స్ పవర్ యంత్రాలతో సబ్ ఎయిర్ సిస్టం రన్ అవుతుంది. వాటి ద్వారా నీరు మొత్తం డ్రైనేజీ కాలువల ద్వారా బయటికి వెళ్తుంది. ఆ తర్వాత డ్రయర్లు, రోప్స్ మైదానాన్ని సిద్ధం చేస్తాయి..

సబ్ ఎయిర్ సిస్టం ద్వారా ఒక మోస్తరు వర్షం పడితే 15 నిమిషాల్లోనే మైదానాన్ని సిద్ధం చేయొచ్చు. విధానం వల్ల ఒక్క నిమిషంలోనే పదివేల లీటర్ల నీటిని సబ్ ఎయిర్ సిస్టం పీల్చివేస్తుంది. ఒకవేళ గంటపాటు వర్షం కురిస్తే 30 నుంచి 40 నిమిషాలలో వర్షపు నీరును బయటికి పంపిస్తుంది. సబ్ ఎయిర్ సిస్టం కోసం కర్ణాటక క్రికెట్ బోర్డు అప్పట్లోనే 12 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. భారతదేశంలో ఈ విధానం ఉన్న మైదానం బెంగళూరు చిన్న స్వామి స్టేడియం మాత్రమే. ప్రస్తుతం బెంగళూరులో వర్షం తగ్గడం లేదు. రాత్రి పది గంటల 30 నిమిషాల లోపు వర్షం తగ్గి, మ్యాచ్ పున: ప్రారంభం కావాలి. లేకుంటే మ్యాచ్ రద్దు అవుతుంది. ఐపీఎల్ నిబంధనలు ప్రకారం ఎంపైర్లు ఇరుజట్లకు చెరో పాయింట్ ఇస్తారు. దీనివల్ల చెన్నై ప్లే ఆఫ్ వెళ్తుంది. బెంగళూరు లీగ్ దశలోనే నిష్క్రమిస్తుంది.