Rajasthan Royals Vs Gujarat Titans Match Preview: జల్సా సినిమా చూశారా.. అందులో పవన్ కళ్యాణ్ ముఖేష్ రుషిని ఉద్దేశించి.. మీకు అన్నీ ఉన్నాయ్ అంకుల్..లేనిదల్లా ఒకటే.. అదే భయం.. మీకు దాన్ని పరిచచం చేయిస్తాను. దాన్ని మీకు టన్నుల్లో ఇస్తాను అంటూ బెదిరిస్తాడు. ఇప్పుడు అదే డైలాగ్ ను రిపీట్ చేస్తోంది రాజస్థాన్ రాయల్స్.
ఐపీఎల్ రాజస్థాన్ జట్టు జోరు మీద ఉంది. ఇటీవల జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ చెన్నై మీద వాళ్ల సొంత గ్రౌండ్ లోనే విజయం సాధించింది. జైస్వాల్38, వైభవ్ సూర్యవంశీ 52, ద్రువ్ జూరెల్ 18, రియాన్ పరాగ్ 14 పరుగులతో ఆకట్టుకున్నారు. ఆ మ్యాచ్ లో చైన్నై జట్టును రాజస్థాన్ బౌలర్లు 127 పరుగులకు ఆలౌట్ చేశారు. ఆర్చర్, బర్గర్, రవీంద్ర జడేజా చెరి రెండు వికెట్లు పడగొట్టారు. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ సాధించారు.
చెన్నై జట్టుపై విజయం సాధించిన నేపథ్యంలో రాజస్థాన్ జట్టు ఉత్సాహంతో ఉంది. శనివారం గుజరాత్ తో జరిగే మ్యాచ్ కోసం పూర్తి సిద్ధంగా ఉంది. కడపటి సమాచారంఅందేవరకు జట్టులో ఎటువంటి మార్పులు లేవని తెలుస్తోంది. రాజస్థాన్ లో ఉత్సాహం కనిపిస్తుంటే.. గుజరాత్ లో మాత్రం విపరీతమైన భయం ఉంది. సొంతమైదానంలో ఆడుతున్నప్పటికీ గిల్ సేన తీవ్రమైన ఒత్తిడిలో కనిపిస్తోంది.
ఇటీవల పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ 162 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 13, గిల్ 39, బట్లర్ 38, ఫిలిప్స్ 25, సుందర్ 18 పరుగులు చేశారు. ఈ టార్గెట్ కాపాడుకోవడంలో గుజరాత్ విఫలమైంది. పంజాబ్ జట్టులో ప్రియాన్ష్ ఆర్య విఫలమైనప్పటికీ.. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 37, కూపర్ కనోలి 72 అదరగొట్టారు. వీరిద్దరూ గుజరాత్ బౌలింగ్ ను చీల్చి చెండాడారు. దీంతో పంజాబ్ గెలిచింది.
గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, సిరాజ్ మాత్రమే మెరుగ్గా వేస్తున్నారు. ఇందులో రషీద్ కు ఒక వికెట్ లభించింది. ప్రసిద్ క్రిష్ణ మూడు వికెట్లు తీశాడు. అతడు కూడా పొదుపుగా పరుగులు ఇచ్చాడు. మిగతా బౌలర్లు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయారు. రాజస్థాన్ గెలిచి ఉత్సాహంలో ఉంది. గుజరాత్ ఓడి బాధలో ఉంది. ఇలాంటి స్థితిలో గుజరాత్ కు ఓ గెలుపు కావాలి. కానీ, అంత ఈజీ కాకపోవచ్చని తెలుస్తోంది.
