Rahul Dravid: పాకిస్తాన్ చేతిలో ఓడి.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై నీలి నీడలు కమ్ముకున్న వేళ టీమిండియాను ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచకప్ టీ20 తర్వాత కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నట్టు కోహ్లీ ప్రకటించాడు. ప్రపంచకప్ తో టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీకాలం కూడా పూర్తయ్యి వైదొలుగుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్ ను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఒప్పించాడు. ఆసక్తి లేకున్నా ఇండియా ఏ, అండర్ 19 జట్టును బలంగా తయారు చేసిన ద్రావిడ్ ను ఎలాగైనా టీమిండియా హెడ్ కోచ్ గా రావాలని కోరారు.
ఈ క్రమంలోనే ఎన్.సీఏ డైరెక్టర్ గానే కొనసాగుతున్న ద్రావిడ్ మనసు మార్చుకున్నాడు. బీసీసీఐ పెద్దల కోరిక మేరకు తాజాగా బెట్టు వీడిన రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ బీసీసీఐ పెద్దలతో చర్చించిన అనంతరం కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్లు తెలిసింది.
టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆడనుంది. ఆ సిరీస్ నుంచే రాహుల్ ద్రావిడ్ అందుబాటులో ఉండనున్నారు. బోర్డు పెద్దలు రాహుల్ ద్రావిడ్ కు ఏకంగా కోచ్ పదవికి రూ.10 కోట్ల వేతనాన్ని ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. కోచ్ పదవికి దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేది కావడంతో రాహుల్ ద్రవిడ్ ను ఒప్పించి మరీ దరఖాస్తు చేయించారు.
ఇఖ ద్రవిడ్ హెడ్ కోచ్ గా వస్తుండడంతో ఎన్.సీఏ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయబోతున్నాడు. ఆ పదవికి మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ను తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. బ్యాటింగ్ కోచ్ పదవికి విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ పదవికి అజయ్ రాత్రా దరఖాస్తు చేసినట్టు తెలిసింది.