Ambati Rayudu : ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక ట్రోల్ తెగ పాపులర్ అయిపోయింది. ‘కాకి వచ్చి రెట్ట వేసినా దాన్ని నాకేసి మన కులపు కాకే’ అని ఆ పేడ సైతం తినే కుల జాఢ్యం గాళ్లు ఏపీలో ఎక్కువైపోయారని చాలా చక్కగా వివరించారు. ‘మన కులపోడు’ అయితే చాలు వాడికి అర్హతలు లేకున్నా అందలమెక్కించడం.. ఇక మన కులపోడు కానివాడిని అథ: పాతాళానికి తొక్కేయడం అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సైతం ఏపీలోని కాపు కులానికి చెందిన అంబటి రాయుడును ఇలానే తొక్కేశాడన్న చేదు నిజం తాజాగా బయటపడింది. దీనిపై స్పెషల్ స్టోరీ
చెన్నై సూపర్ కింగ్స్కు ఐదో టైటిల్.. వ్యక్తిగతంగా ఆరో టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు. ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని రికార్డు రాయుడు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ టైటిల్ సాధించి క్రికెట్ కేరీర్ ముగించిన రాయుడు భారత క్రికెట్లో నిజమైన వర్క్హార్స్లలో ఒకడు. భారత్ తరఫున 55 వన్డేలు, ఆరు టీ20లు ఆడినప్పటికీ, ప్లేయింగ్ ఎలెవన్లో శాశ్వత స్థానం దక్కించుకోలేకపోయాడు. 2019 ప్రపంచ కప్కు టీంను సెలక్ట్ చేస్తున్న సమయంలో నాలుగో స్థానం కోసం గాలించిన బీసీసీఐకి రాయుడు మెరుపు తీగలా కనిపించాడు. అయితే కుల రాజకీయాల కారణంగా రాయుడు టీమిండియా తరఫున ప్రపంచకప్ ఆడే అవకాశం కోల్పోయాడు..
నాలుగో స్థానంలో ఒదిగిపోయి..
2018, సెప్టెంబరు నుంచి 2019 మార్చి వరకు టీమిండియాకు నాలుగో స్థానంలో దొరికిన తురుపు ముక్కలా రాయుడు కనిపించాడు. 2018లో ఐపీఎల్లో 602 పలుగులు చేశాడు. రాయుడు ఆ ఆరు నెలల వ్యవధిలో 21 వన్డేలు ఆడాడు. ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలతో సహా 639 పరుగులు చేశాడు. ఇది సామాన్యమైన ప్రదర్శన కాదు.
ఐనా వరల్డ్ కప్కు ఎంపిక చేయని వైనం..
అద్భుత ఫామ్.. అత్యద్భుతమైన ప్రదర్శనతో మంచి ఊపుమీద ఉన్న రాయుడిని ఇంగ్లండ్లో 2019లో జరిగిన ప్రపంచ కప్కు మాత్రం ఎంపిక చేయలేదు. ప్రకటించిన జట్టులో రాయుడు పేరు కనిపించలేదు. రాయుడు స్థానంలో కేఎల్.రాహుల్, ఆల్రౌండర్ విజయ్ శంకర్ను ఎంపిక చేసి ఆశ్చర్యపర్చింది బీసీసీఐ. కానీ, ఈ నిర్ణయం తప్పని వరల్డ్కప్లో వారి ఆట తీరుతో తేలిపోయింది.
రాయుడును తప్పించడాన్ని తప్పు పట్టిన కుంబ్లే..
2019 ప్రపంచకప్ టీంకు అంబటి రాయుడును ఎంపిక చేయకపోవడాన్ని బౌలింగ్ లెజెండ్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తప్పు పట్టాడు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి ఆరు నెలలపాటు ఆ ప్రత్యేక పాత్ర కోసం రాయుడిని సిద్ధం చేసిన తర్వాత చివరి నిమిషంలో అతనిని తప్పించడం ద్వారా రాయుడు మనస్థాపంతో అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికారని ఆరోపించారు.
కెరీర్కు గుడ్బై చెప్పిన రాయుడు…
2019 ప్రపంచకప్లో స్థానం కల్పించకపోవడంతో కలత చెందిన రాయుడు తన అంతర్జాతీయ కెరీర్కే ముగింపు పలికాడు. తన స్థానంలో ఎంపిక చేసిన విజయ్ శంకర్ ఒక 3డి (3 డైమెన్షనల్) ప్లేయర్ అని నాటి చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే.ప్రసాద్ చేసిన వ్యాఖ్యతో రాయుడు మరింత హర్ట్ అయ్యాడు. ‘ప్రపంచ కప్ చూడటానికి కొత్త సెట్ 3డి గ్లాసెస్ ఆర్డర్ చేశాను‘ అని వివాదాస్పద ట్వీట్ చేసి అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
కులజాఢ్యానికి రాయుడి కెరీర్ బలి!
ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న కులజాఢ్యం ఏ స్థాయిలో, ఎంత మందం మేర, ఎక్కడెక్కడ, ఎంత ఉన్నత స్థాయిలో పేరుకుని పోయిందో మనకు తెలుసు. ఇన్నాళ్లూ మనం దాన్ని చూస్తూ వచ్చాం కూడా. ఈ కులజాఢ్యం అనేది రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. తన పరిధిని పెంచుకుంది. మరింత విస్తృతమైంది. అన్ని రంగాల్లోనూ విస్తరించింది. చివరికి క్రికెట్ను కూడా వదల్లేదు. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే క్రికెట్ కు కూడా పాకింది. ఏకంగా– జాతీయ స్థాయి క్రికెట్ను శాసించే స్థాయికి చేరింది. దాన్ని కబళించి పడేసింది. దీని ఫలితమే– యంగ్ క్రికెటర్ అంబటి రాయుడు కేరీర్ అర్ధాంతరంగా ముగిసిందనే ఆరోపణలు ఉన్నాయి.
సెలెక్టర్ కమ్మవాడు కావడంతోనే..
2019లో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా ఏపీకి చెందిన ఎమ్మెస్కే ప్రసాద్ ఉన్నాడు. టీడీపీకి సానుభూతిపరుడిగా ఉన్న ఎమ్మెస్కే కమ్మ కులస్థుడు. నాడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు ఆశీర్వాదంతో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా ఎమ్మెస్కే ప్రసాద్ ఎంపికయ్యాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇందుకు ఎమ్మెస్కే ఏకంగా అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సామాజికవర్గం కావడం కూడా తోడ్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటికే టీం ఇండియా తరఫున మంచి ఫాంలో ఉన్న తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు కాపు కులస్తుడు. అతను వైసీపీకి అనుకూలంగా ఉన్నాడు. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే టీడీపీ అనుకూల వ్యక్తి. ఈ పరిణామాలు కూడా 2019 వన్డే వరల్డ్ కప్లో రాయుడికి టీమిండియాలో చోటు దక్కకపోవడానికి కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. ‘‘రాయుడు జట్టులో ఉంటే 2019 వరల్డ్ కప్ టీమిండియా గెలిచేది’’ అని మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరబ్ గంగూలీ అప్పట్లోనే వ్యాఖ్యానించాడు. గౌతం గంభీర్ కూడా రాయుడికే సపోర్ట్ చేశాడు. అంటే చీఫ్ సెలెక్టర్గా ఎమ్మెస్కే చేసిన పొరపాటు రాయుడు కెరీర్ను దెబ్బతీయడంతోపాటు టీమిండియా ఓటమికి కారణమైందని చెప్పవచ్చు.
నెటిజన్ల ట్రోల్..
ఉజ్వల భవిష్యత్తు ఉన్న అంబటి రాయుడి కేరీర్ అర్ధాంతరంగా ముగియడం వెనుక భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్, తెలుగు వాడైన మన్నవ శ్రీకాంత్ ప్రసాద్ అలియాస్ ఎమ్మెస్కే ప్రసాద్ హస్తం ఉందని నెటిజన్లు, ట్విట్టర్ లో ఆరోపించారు. ఎమ్మెస్కేను తెగ ట్రోల్ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ట్వీట్ల వర్షాన్ని కురిపించారు. అవన్నీ అప్పట్లో ఎమ్మెస్కే ప్రసాద్ను వేలేత్తి చూపాయి. రాష్ట్రంలో సహజంగానే రెండు ప్రధాన కులాలైన కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు, మనస్పర్థలు అంబటి రాయుడి కేరీర్ను తొక్కేశాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఆ ఇద్దరిదీ ఒకే జిల్లా..
తెలుగు క్రికెటర్లు ఎమ్మెస్కే ప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆటగాడు. ఇక అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన క్రికెటర్. అటు ఎమ్మెస్కే ప్రసాద్, ఇటు అంబటి రాయుడు ఇద్దరిదీ గుంటూరు జిల్లానే. అంబటి రాయుడు పొన్నూరు మండలం వెల్లలూరుకి చెందిన యువకుడు కాగా.. ఎమ్మెస్కే ప్రసాద్ స్వస్థలం సత్తెనపల్లి పరిధిలోని మేడికొండూరు.
అజరుద్దీన్ ఎంకరేజ్ చేస్తే.. ఎమ్మెస్కే తొక్కేశాడు..
క్రికెట్లో భాషాభిమానానికి, ప్రాంతీయ అభిమానానికి తావు ఉండదు. ఆటగాళ్ల ప్రతిభను మాత్రమే కొలమానంగా తీసుకుని క్రికెటర్లను ఎంపిక చేస్తారు. ఇందులో ఇక సందేహాలు అనవసరం. హైదరాబాదీయుడు, తెలుగువాడైన మహమ్మద్ అజరుద్దీన్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా ఉన్న సమయంలో తోటి తెలుగు క్రికెటర్ వెంకటపతి రాజుకు అవకాశం కల్పించాడు. అప్పట్లో దీనిని తప్పుపట్టారు. అజరుద్దీన్ ప్రాంతీయ అభిమానాన్ని చూపుతున్నారని అంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ.. తన ప్రతిభతో అందరి నోళ్లనూ మూయించగలిగాడు వెంకటపతి రాజు. తాను ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్లోనే ఎనిమిది వికెట్లను పడగొట్టి తానేమిటో నిరూపించుకున్నాడు వెంకటపతి రాజు. అజర్ తెలుగు వాడిని ఎంకరేజ్ చేస్తే.. ఎమ్మెస్కే మాత్రం.. చీఫ్ సెలెక్టర్ హోదాలో ఉండి కూడా మంచి ఫాంలో ఉన్న సొంత జిల్లా వాడిని వరల్డ్ కప్కు ఎంపిక చేయకుండా కెరీర్కు పరోక్షంగా ముగింపు పలకడం గమనార్హం.