KL Rahul: కెఎల్ రాహుల్ ను బయటికి పంపించిన లక్నో.. కొత్త కెప్టెన్ గా అతడే..

ఊహించిందే జరుగుతోంది. అంచనా వేసింది నిజమౌతోంది. ఐపీఎల్ -2025 సీజన్ ప్రారంభానికి ముందు లక్నో జట్టులో పెను మార్పులకు రంగం సిద్ధమవుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 28, 2024 4:40 pm

KL Rahul(2)

Follow us on

KL Rahul: లక్నో జట్టు అందరూ అనుకున్నట్టుగానే అడుగులు వేస్తోంది. 2025 ఐపీఎల్ సీజన్లో కెప్టెన్ గా రాహుల్ ను వదులుకోవడానికి సిద్ధమైంది. అంతేకాదు అతడి స్థానంలో కొత్త కెప్టెన్ ను నియమించుకోవడానికి కూడా రెడీ అయింది.. మరో మూడు రోజులు మాత్రమే రిటైన్ లిస్ట్ సమర్పించడానికి గడువు ఉంది. దానికంటే ముందే లక్నో జట్టు సంచలన నిర్ణయాలు తీసుకుంది.. ఇద్దరు అనామక ఆటగాళ్లతో పాటు, ముగ్గురు స్టార్ ఆటగాళ్లను జట్టులో ఉంచుకోనుంది. నిబంధనల ప్రకారం ఈనెల చివరి తేదీ లోపు యాజమాన్యాలు తమ రిటైన్ లిస్టును సమర్పించాల్సి ఉంది.. ఒక్కో జట్టు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ఆటగాళ్లు , ఇద్దరు అన్ క్యాప్డ్ ఆటగాళ్లకు అవకాశం ఉంది. ఆర్టీఎం కార్డు ద్వారా లేదా బీసీసీ నిబంధనల ప్రకారం నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవడానికి ఫ్రాంచైజీలకు అవకాశం ఉంది. అలా రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు వరుసగా 18, 14, 11 కోట్లు ఇవ్వాలి. ఒకవేళ నాలుగో, ఐదో ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలి అనుకుంటే 18, 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అనామక ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలనుకుంటే నాలుగు కోట్లు చెల్లించాలి. అయితే ఈ నిబంధనల ప్రకారం లక్నో జట్టు ఇద్దరు అనామక ఆటగాళ్లు మోహ్ సిన్ ఖాన్, ఆయుష్ బదోని ని రిటైన్ చేసుకోనుంది. వీరితోపాటు నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ ని వరుసగా 18, 14, 11 కోట్ల చెల్లించి తీసుకోనుంది. నికోలస్ పూరన్ కు జట్టు సారధ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుంది. మార్కస్ స్టోయినిస్ ను రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా అంటిపెట్టుకోనుంది.

నిలకడగా ఆడుతున్న పూరన్

కొంతకాలంగా పూరన్ టి20లలో అద్భుతంగా ఆడుతున్నాడు. ఏకంగా గేల్ రికార్డులను కూడా బద్దలు కొడుతున్నాడు. బ్యాటర్ గానే కాదు, వికెట్ కీపర్ గానూ పూరన్ సత్తా చాటుతాడు. అందువల్లే రిటైన్ జాబితాలో ఫస్ట్ ప్రయారిటీగా పూరన్ ను లక్నో జట్టు ఎంచుకుందని తెలుస్తోంది. అయితే జట్టు కెప్టెన్సీ నుంచి బయటికి వెళ్లిపోవడం అనివార్యం కావడంతో.. రాహుల్ వేలంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అతడు కనుక వేలంలోకి వస్తే దక్కించుకోవాలని.. కెప్టెన్ గా నియమించాలని బెంగళూరు జట్టు భావిస్తోంది. ఎందుకంటే ఈసారి డూ ప్లె సిస్ కు ఉద్వాసన పలకాలని బెంగళూరు యాజమాన్యం నిర్ణయించుకుంది. అందువల్లే అతని స్థానాన్ని రాహుల్ తో భర్తీ చేయాలని భావిస్తోంది. డూ ప్లెసిస్ గత సీజన్లో అంతగా రాణించలేకపోయాడు. పైగా అతడికి వయసు కూడా ఎక్కువ కావడంతో చురుకుగా ఆడలేక పోతున్నాడు. దీంతో అతడిని బయటికి పంపించి.. రాహుల్ ను కెప్టెన్ చేయాలని బెంగళూరు యాజమాన్యం నిర్ణయించుకుంది.