Ishan Kishan: దున్నపోతు ఈనిందంటే దొడ్లో కట్టేయమన్నాడట వెనుకడికి ఒకడు.. ఇప్పుడు కొంతమంది సూడో స్పోర్ట్స్ ఎనలిస్టుల పరిస్థితి కూడా అలానే తయారయింది. క్రికెట్ చూడటం.. తమకు తామే మేధావులు అని చెప్పుకోవడం.. ఏదోక సోషల్ మీడియాలో పేజీ క్రియేట్ చేయడం.. అందులో చవకబారు కంటెంట్ పోస్ట్ చేయటం కామన్ అయిపోయింది.. ఇటువంటివారు ఎలా తయారయ్యారంటే.. చివరికి బీసీసీఐ నిర్ణయాలు కూడా వీరే తీసుకుంటున్నారు. తీసుకోవడం మాత్రమే కాదు అమలు జరిగిపోయాయి అన్నట్టుగా చెబుతున్నారు.
టీమిండియా మేనేజ్మెంట్ టి20 క్రికెట్లో మార్పులకు శ్రీకారం చుట్టినట్టు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. పైగా అయ్యర్ కు సారధ్య బాధ్యతలు అప్పగిస్తారని ప్రచార జరుగుతుంది. దీనిని ఆమోదించిన వారు లేరు. అలాగని ఖండించిన వారు కూడా లేరు. అయ్యర్ ను పక్కనబెట్టి ఏకంగా సంజు శాంసన్ కు జట్టు పగ్గాలు ఇస్తున్నారని వార్తలు రాయడం మొదలుపెట్టారు. వాస్తవానికి సంజు ఇటీవల టి20 క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్నాడు. టి20 వరల్డ్ కప్ లో సత్తా చూపించాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు.
సంజు మాత్రమే కాదు సూర్య కుమార్ యాదవ్ కూడా అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా టి20 ఫార్మాట్లో నిలిచాడు. ఇతడి నాయకత్వంలో టీమిండియా ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు. 2024లో టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత టీమిండియా పగ్గాలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. ఆటగాడిగా విఫలమైనప్పటికీ.. నాయకుడిగా మాత్రం నూటికి నూరు శాతం మార్కులు వేసుకున్నాడు. కొంతకాలంగా అతడు సరిగ్గా ఆడలేక పోతున్నప్పటికీ.. నాయకుడిగా మాత్రం అతడు అద్భుతంగానే రాణిస్తున్నాడు. వాస్తవానికి అతడిని తప్పిస్తున్నట్టు ఇటీవల మేనేజ్మెంట్ లీకులు ఇచ్చినట్టు కొంతమంది వార్తలు రాశారు కానీ.. అందులో వాస్తవం లేదు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం మీద మేనేజ్మెంట్ బలమైన నమ్మకంతో ఉంది. అలాంటప్పుడు అతడిని ఎందుకు పక్కన పెడుతుంది.
సూర్య కుమార్ యాదవ్ ను పక్కన పెట్టినట్టు.. అయ్యర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్లు.. సంజు శాంసన్ కు కెప్టెన్సీ కేటాయించినట్టు వార్తలు రాసిన కొంతమంది సూడో స్పోర్ట్స్ అనలిస్టులు.. ఇప్పుడు ఇషాన్ కిషన్ వైపు దృష్టి సారించారు. ఐపీఎల్ లో అతడు గొప్పగా ఆడుతున్న నేపథ్యంలో.. అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్టు వార్తలు రాయడం మొదలుపెట్టారు. దీనినే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటారని.. నిజమైన స్పోర్ట్స్ జర్నలిస్టులు చెబుతున్నారు. ఏదైనా రాస్తే నమ్మే విధంగా ఉండాలి. ముఖం మీద ఉమ్మే విధంగా ఉండకూడదని వారు ఉమ్మి వేస్తూ మరీ చెబుతున్నారు.