IPL 2027: 2026 ఐపిఎల్ పూర్తయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా అవతరించింది. 2027 ఐపీఎల్ నిర్వహించేందుకు ఇంకా సమయం ఉంది. దానికి ఇంతలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఊహించని షాక్ తగిలింది. ఈ మూడు జట్లలో కీలకమైన ప్లేయర్లు 2027 ఐపీఎల్ ఆడే విషయంలో సందిగ్ధం నెలకొంది.
2027 లో సాగే వన్డే వరల్డ్ కప్ సాధించాలని ఆస్ట్రేలియా జట్టు బలమైన నిర్ణయంతో ఉంది. 2023లో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ అందుకుంది. ఫైనల్ లో టీమిండియాను ఓడించింది. దీంతో 2027 లో కూడా అదే జోరు కొనసాగించాలని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆడే కీలకమైన బౌలర్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.
హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ జట్లలో కీలకమైన ప్లేయర్లుగా ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టార్క్, హేజిల్ వుడ్, కమిన్స్ ను 2027లో నిర్వహించే ఐపిఎల్ లో ఆడించకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వర్క్ లోడ్ పెంచకూడదని.. వీరు ముగ్గురు ప్రధాన బౌలర్లు కావడంతో.. ఒత్తిడి పెంచొద్దని ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీనిని ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ ఆ ముగ్గురు బౌలర్లకు చెప్పినట్టు తెలుస్తోంది.
రెవ్యాజ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం 2027 వన్డే ప్రపంచ కప్ గెలవాలని క్రికెట్ ఆస్ట్రేలియా బలంగా కోరుకుంటున్నది. అందువల్లే జట్టును ఇప్పటినుంచే బలోపేతం చేసేందుకు కసరత్తులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కీలకమైన ముగ్గురు ఆ బౌలర్లకు విశ్రాంతితోపాటు.. ఐపీఎల్ లాంటి టోర్నీలలో ఆడకుండా.. కేవలం జాతీయ జట్టుకు మాత్రమే ఆడే విధంగా రూపకల్పన చేసింది. ఫలితంగా వారి మీద ఒత్తిడి తగ్గి.. 2027 వన్డే ప్రపంచ కప్ గెలిచేందుకు ఆస్కారం ఏర్పడుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తుంది. అయితే బోర్డు నిర్ణయాన్ని ఈ ముగ్గురు బౌలర్లు పాటిస్తారా.. లేదా అనేది చూడాల్సి ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
