IPL 2026 Rajasthan Royals team analysis: 2008లో ఐపీఎల్ మొదలైంది. నాటి సీజన్ లో షేన్ వార్న్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలిచింది. అంతే కాదు, సంచలన జట్టుగా పేరు గడించింది. ఇక అప్పటి నుంచి రాజస్థాన్ ఇంతవరకూ ఐపీఎల్ ట్రోఫీ అందుకోలేదు. 2022లో ఫైనల్ దాకా వెళ్లినప్పటికీ విజేతగా నిలవలేకపోయింది. గత ఏడాది అత్యంతదారుణంగా తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. కోచ్ స్థానం నుంచి ద్రావిడ్ తప్పుకున్నాడు. రాజస్థాన్ జట్టుకు డైరక్టర్ గా ఉన్న సంగక్కర ప్రస్తుతం కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఈసారి సత్తా చాటాలని రాజస్థాన్ జట్టు భావిస్తోంది.
సంజు వెళ్లిపోయాడు
మెగావేలంలో రాజస్థాన్ జట్టు నుంచి సంజుశాంసన్ వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతడు చైన్నై జట్టు తరఫున ఆడుతున్నాడు. గత ఏడాది ఆపద్దర్మ నాయకుడిగా ఉన్న రియాన్ పరాగ్ ప్రస్తుతం పూర్తిస్థాయి సారథిగా ఉన్నాడు. గత ఏడాది రాజస్థాన్ జట్టులో తీక్షణ, ఫజల్ హక్, ఫారూఖీ సరిగ్గా ఆడలేదు. దీంతో వారందరనీ రాజస్థాన్ జట్టును వదులుకుంది. ఈ సీజన్ లో చైన్నై నుంచి రవీంద్ర జడేజా రాజస్థాన్ లోకి వచ్చాడు. సామ్ కరణ్, రవి బిష్ణోయ్, డొనోవన్ ఫెరీరా, ఆడమ్ మిల్నే వంటి యంగ్ ప్లేయర్లు రాజస్థాన్ జట్టులో ఉన్నారు. వీరంతా విధ్వంసానికి పరాకాష్టగా ఆడగలరు. తెలుగు ఆటగాడు అమన్ రావు రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. ఇతడు తన ఐపీఎల్ ప్రస్థానాన్ని రాజస్థాన్ జట్టు ద్వారా మొదలుపెడుతున్నాడు.
ఇవీ సామర్థ్యాలు
రాజస్థాన్ జట్టులో వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వాల్ ప్రమాదకరంగా ఉన్నారు. వీరిద్దరూ విధ్వంసం కొనసాగించగలరు. వాస్తవానికి రాజస్థాన్ జట్టు గత ఏడాది తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. సంజు సరైన ఫామ్ లో లేడు. యాజమాన్యం, కోచ్ తో సయోధ్య లేకపోవడంతో ఒక రకమైన అలజడి వాతావరణం ఏర్పడింది. నాడు తాత్కాలిక సారథిగా రియాన్ పరాగ్ జట్టును అంతగా నడిపించలేకపోయాడు. ఈ సీజన్ లో రాజస్థాన్ జట్టు పై తనదైన ముద్ర వేయాలని పరాగ్ భావిస్తున్నాడు. అండర్ 19 లో సత్తా చూపించిన వైభవ్ సూర్యవంశీ.. ఈ సీజన్ లో అదరగొట్టాలని భావిస్తున్నాడు. యశస్వి ఫామ్ పై యాజమాన్యం నిశ్చింతగా ఉంది. ధ్రువ్ జూరెల్, హిట్ మేయర్, లువాన్ ప్రిటోరియస్ వంటి ప్లేయర్లతో రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ బలం సమర్థవంతంగా ఉంది. ఒక వేళ సామ్ కరణ్, జడేజా అదరగొడితే రాజస్థాన్ జట్టుకు తిరుగుండదు. రవి బిష్ణోయ్ స్పిన్ బౌలింగ్ తో అదరగొడితే రాజస్థాన్ జట్టు ప్రత్యర్థుల పై పట్టు సాధించవచ్చు.
Also Read: బెంగళూరు మరోసారి భళా అనిపిస్తుందా? జట్టు సామర్థ్యం, బలహీనతలు ఇవే!
ఇవీ లోపాలు
రాజస్థాన్ లో సమష్టితత్వం కనిపించడం లేదు. గత ఏడాది చెప్పుకునేస్థాయిలో విజయాలు సాధించలేదు. ఈ సీజన్ లో పరాగ్ నాయకుడిగా ఉన్న నేపథ్యంలో..అతడు జట్టును ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్తాడో చూడాల్సి ఉంది. జడేజా సమర్థవంతమైన ఆటగాడైనప్పటికీ .. 37 ఏళ్ల వయసులో ఏమేరకు సత్తా చూపిస్తాడనేది చూడాల్సి ఉంది. రవి బిష్ణోయ్ స్పిన్ బౌలింగ్ వేసే సమర్థుడే అయినప్పటికీ..అతడికి సహకరించే బౌలర్ లేడు. పేస్ విభాగంలో లోపాలు కనిపిస్తున్నాయి. ఆర్చర్ మీద ఆశలు ఉన్నప్పటికీ గత ఏడాది అతడు ఆకట్టుకోలేదు. మిల్నే, బర్గర్, మఫాకా వంటి బౌలర్లు ఉన్నప్పటికీ వారు ఏమేరకు ఆకట్టుకుంటారో చూడాల్సి ఉంది. సందీప్ శర్మకు వికెట్లు తీసే సామర్థ్యం ఉన్నప్పటికీ.. అతడికి సహకరించే మరో బౌలర్ రాజస్థాన్ జట్టుకు కావాలి.
ఇండియన్ ప్లేయర్లు
బ్రిజేష్ శర్మ, పరాగ్(కెప్టెన్), జైస్వాల్, వైభవ్, విఘ్నేష్, శుభమ్ దూబే, రవిసింగ్, యుధ్వీర్ సింగ్, సుశాంత్ మిశ్రా, తుషార్ దేశ్ పాండే, అమన్ రావు, కులదీప్ సేన్, యశ్ రాజ్ పుంజా, ధ్రువ్ జూరెల్.
ఫారిన్ ప్లేయర్లు
మఫాకా, డొనోవన్ ఫెరీరా, హిట్ మేయర్, లువాన్ ప్రిటోరియస్, సామ్ కరణ్, ఆడమ్ మిల్నే, జోఫ్రా ఆర్చర్, నాంద్రిబర్గర్.
కీ ప్లేయర్లు
రియాన్ పరాగ్, సామ్ కరణ్, యశస్వి జైస్వాల్, హిట్ మేయర్.
2008లో రాజస్థాన్ విజేతగా నిలిచింది. మళ్లీ ట్రోఫీ అందుకోలేకపోయింది. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని ఆ జట్టు భావిస్తోంది. కుమార సంగక్కర ప్రధాన శిక్షకుడిగా ఉన్న నేపథ్యంలో ఆ జట్టు ఏ స్థాయిలో ఆడుతుందో చూడాల్సి ఉంది.
