IPL 2026 LSG vs DC: ఐపీఎల్ లో భాగంగా బుధవారం లక్నో, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్.. అక్షర్ పటేల్ తమ జట్లను ఎలా నడిపిస్తారనేది చూడాల్సి ఉంది. ఈ రెండు జట్లలో కూడా అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. బ్యాటింగ్ పరంగా.. బౌలింగ్ పరంగా.. ఫీల్డింగ్ పరంగా అద్భుతాలు సృష్టించే ప్లేయర్లు ఉండడంతో పోటీ బీభత్సంగా జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఈ పిచ్ మీద డ్యూ కనిపిస్తున్న నేపథ్యంలో.. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. లక్నో జట్టుకు హోం గ్రౌండ్ కావడంతో పంత్ సేన కు అడ్వాంటేజ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. గత సీజన్లో లక్నో జట్టు అంత గొప్పగా ఆడలేదు. ఢిల్లీ జట్టు ప్రారంభంలో గొప్పగా ఆడినప్పటికీ.. తర్వాత తేలిపోయింది.
గత సీజన్లో ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయకపోయినప్పటికీ లక్నో మేనేజ్మెంట్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. మెగా వేలంలో భారీగా ఖర్చుపెట్టి సామర్థ్యం ఉన్న ప్లేయర్లను కొనుగోలు చేసింది. అటు ఢిల్లీ జట్టు యాజమాన్యం కూడా భారీగానే ధరపెట్టి ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఆటగాళ్ల ప్రతిభ.. ఇతర విషయాలను పక్కన పెడితే.. మ్యాచ్ కు ముందు లక్నో ఆటగాడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి.
Also Read: లక్నో వర్సెస్ ఢిల్లీ: ఆ సూపర్ ఫాస్ట్ బౌలర్ పైనే అందరి దృష్టి
గత ఏడాది ఐపీఎల్లో నోటుబుక్ సెలబ్రేషన్స్ పేరుతో లక్నో జట్టు స్పిన్ బౌలర్ దిగ్వేష్ రాటి వార్తలలో నిలిచాడు. ముఖ్యంగా ఢిల్లీ ఆటగాడి విషయంలో తన స్థాయిని మర్చిపోయి ప్రవర్తించాడు. మ్యాచ్ రిఫరీ ఆగ్రహానికి కూడా కారణమయ్యాడు. ఈ క్రమంలో సీజన్లో కూడా తన ప్రవర్తనను మార్చుకోబోనని అతడు చెబుతున్నాడు. “నేను ఎవరినీ అవమానించడం లేదు. బ్యాటర్ సెంచరీ చేసిన తర్వాత సెలబ్రేషన్ చేసుకుంటాడు. హెల్మెట్ కింద పెట్టి.. బ్యాట్ ఊపుతూ అదరగొడతాడు. నేను కూడా అలానే చేస్తున్నాను. నన్ను ఎవరూ ఆపలేరు. కెప్టెన్ పంత్ నాకు సపోర్ట్ చేస్తున్నాడు. నిషేధం పడకుండా చూసుకోమని మాత్రమే చెబుతున్నాడు. నేను కూడా అలాగే చేస్తున్నానని” దిగ్వేశ్ పేర్కొన్నాడు.
ఇప్పటివరకు ఐపీఎల్ లో మూడు మ్యాచ్లు జరిగాయి. మూడు మ్యాచ్లో కూడా పెద్దగా సంచలన సంఘటనలు చోటు చేసుకోలేదు. అయితే దిగ్వేష్ బుధవారం జరిగే మ్యాచ్ ద్వారా సంచలనం సృష్టించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ అతడు ఓవరాక్షన్ చేస్తే మ్యాచ్ ఫీజులో కోతపడుతుందని హెచ్చరిస్తున్నారు.
