హరారే మైదానం వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ పూర్తిస్థాయిలో ఏకచత్రాధిపత్యం కొనసాగించింది.. ఫలితంగా అండర్ 19 ఫార్మాట్లో టీమ్ ఇండియా ఆరోసారి వరల్డ్ కప్ సాధించింది.
ఈ మ్యాచ్లో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. వైభవ్ సూర్య వంశీ(175) వీర విహారం చేశాడు. ఆయుష్ మాత్రే(53) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అభిజ్ఞాన్ కుండు(40), కనిష్క్ చౌహాన్ (37), వేదాంత్ త్రివేది(32), విహాన్ మల్హోత్రా(30) సత్తా చూపించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో యువభారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు ప్రారంభం నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్ డాకిన్స్ (66) హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. బెన్ మేస్(45) వేగంగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. థామస్ రా(31) కూడా ఇలానే పెవీలియన్ చేరుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 174 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇది క్రమంలో భారత్ కేవలం రెండు పరుగుల వ్యవధిలోనే ఇద్దరు ఇంగ్లాండ్ బ్యాటర్లను అవుట్ చేసి షాక్ ఇచ్చింది. అప్పటికి ఇంగ్లాండ్ జట్టు స్కోర్ 177/7.
ఈ దశలో ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత బౌలర్ల మీద ఎదురు దాడికి దిగారు. ఫాల్కనర్ (115) సూపర్ సెంచరీ తో ఆకట్టుకోవడంతో ఒకానొక దశలో భారత బౌలర్లు ఇబ్బంది పడ్డారు. ఫాల్కనర్ కు మింటూ(28) సహకరించడంతో ఎనిమిదో వికెట్ కు 92 పరుగుల భాగస్వామ్యం నమోదయింది.
అప్పటికి ఇంగ్లాండ్ జట్టు స్కోర్ 269/8. ఈ దశలో భారత బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేశారు. తద్వారా ఇంగ్లాండ్ జట్టు భారీ భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోయింది. 9వ వికెట్ కు 12 పరుగులు, పదో వికెట్ కు 30 పరుగులు జోడించింది. ఫలితంగా ఇంగ్లాండ్ ప్రస్థానం 311 పరుగుల వద్ద ముగిసింది. దీంతో టీమిండియా వంద పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం ద్వారా ఆరవసారి అండర్ 19 వరల్డ్ కప్ ట్రోఫీని టీమిండియా తన ఖాతాలో వేసుకుంది.
