IND vs ENG 4th Test : 192 పరుగులు.. పెద్ద స్కోరేం కాదు. అలాగని ప్రత్యర్థి జట్టు అనామకం కాదు. 2013 తర్వాత ఆ స్థాయిలో పరుగులను చేజ్ చేసి గెలిచిన హిస్టరీ భారత జట్టుకు లేదు. అయినప్పటికీ రోహిత్ ఉన్నాడు. యశస్వి జైస్వాల్ దూకుడు మీద ఉన్నాడు. గిల్ నిలబడగలడు. ధృవ్ ఆదుకోగలడు.. అనే అంచనాలు సగటు భారత క్రికెట్ అభిమానుల్లో ఉన్నాయి. వారు ఆశించినట్టుగానే నాలుగో టెస్ట్ లో ఆ నలుగురే కీలకమయ్యారు. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇందులో స్పిన్నర్ల పాత్రను తక్కువ చేయడానికి లేదు. తొలి ఇన్నింగ్స్ లో జడేజా నాలుగు వికెట్లు పడగొడితే.. రెండవ ఇన్నింగ్స్ లో అశ్విన్ ఐదు వికెట్లు తీశాడు. కులదీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
వాస్తవానికి తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన ఏడు వికెట్లు కోల్పోయి ప్రత్యర్థి జట్టు కంటే 150 పరుగులు వెనుకబడిపోయినప్పటికీ.. యువ వికెట్ కీపర్ ధృవ్ జరెల్ 90 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని 47 పరుగులకు తగ్గించాడు. అతడు గనక ఆ స్థాయిలో ఇన్నింగ్స్ ఆడకుండా ఉండి ఉంటే భారత జట్టు పరిస్థితి మరో విధంగా ఉండేది. ధృవ్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో భారత జట్టు 307 స్కోర్ చేయగలిగింది.
రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టును భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కులదీప్ యాదవ్ 145 పరుగులకే ఆలౌట్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్ ఐదు, కులదీప్ నాలుగు వికెట్లు తీసి సత్తా చాటారు. అనంతరం 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ(55), యశస్వి జైస్వాల్ (37) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు వీరు 84 పరుగులు జోడించారు. వీరిద్దరు 15 పరుగుల వ్యవధిలో అవుట్ అయిన తర్వాత భారత జట్టు లో అనుకోని కుదుపు ఏర్పడింది. రజత్, జడేజా సర్ఫ రాజ్ వంటి బ్యాటర్లు వెంట వెంటనే అవుట్ అయ్యారు. బషీర్ బౌలింగ్లో రజత్, సర్ఫ రాజ్ సున్నా పరుగులకే అవుట్ కావడం విశేషం. 120 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడినప్పుడు గిల్, ధృవ్ ఆపద్బాంధవుల అవతారం ఎత్తారు. బషీర్ ఇబ్బంది పెడుతున్నప్పటికీ అడ్డుగోడలా నిలబడి భారత జట్టును రక్షించారు. వీరిద్దరూ అబేధ్యమైన ఆరో వికెట్ కు 72 పరుగులు జోడించి భారత జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. ఈ విజయంతో భారత్ మరో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకుంది..
భారత జట్టు 2013లో సొంత గడ్డపై చివరిసారిగా రెండవ ఇన్నింగ్స్ లో 150 కంటే ఎక్కువ స్కోర్ ఛేదించింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు 150 కంటే ఎక్కువ పరుగుల టార్గెట్ ఉంటే ఓడిపోతూ వస్తోంది. కానీ ధోని ఇలాఖాలో 150 పరుగులకు మించి లక్ష్యాన్ని ఛేదించి అపప్రదను తొలగించుకుంది.