Singapore VS Mongolia : అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత చెత్త రికార్డు.. మరీ ఇంత స్వల్ప స్కోర్ కు ఆలౌట్ ఏంట్రా బాబూ..

అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత చెత్త రికార్డు నమోదయింది.. గల్లి క్రికెట్ కంటే దారుణంగా ఆడిన క్రికెటర్లు.. అత్యంత స్వల్ప స్కోర్ చేసి ఆలౌట్ అయ్యారు. దీంతో నెటిజన్లు ఆ ఆటగాళ్లపై మండిపడుతున్నారు. ఈ మాత్రం స్కోర్ కు క్రికెట్ ఆడటం ఎందుకురా బాబూ అంటూ ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 5, 2024 3:47 pm

Singapore VS Mongolia

Follow us on

Singapore Vs Mongolia : ఐసీసీ మెన్స్ టి20 వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫైయర్ – ఏ విభాగంలో సింగపూర్, మంగోలియా జట్లు తలపడ్డాయి. ఇందులో భాగంగా సింగపూర్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మంగోలియా కేవలం పదిపరుగులకే పతనమైంది. దీంతో అంతర్జాతీయ టి20 క్రికెట్లో అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకుంది. అత్యంత స్వల్ప స్కోర్ చేసిన టీం గా పరువు పోగొట్టుకుంది. ఈ మ్యాచ్ లో మంగోలియా జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. కేవలం పది పరుగులు మాత్రమే సాధించి కుప్పకూలింది. మంగోలియా జట్టులో ఐదుగురు ఆటగాళ్లు 0 పరుగులకే వెనుతిరి గారు. నలుగురు ఆటగాళ్లు ఒక పరుగు మాత్రమే చేశారు. ఇద్దరు ఆటగాళ్లు రెండు పరుగులు చేశారు. ఇక మిగతా రెండు పరుగులు ఎక్స్ ట్రా ల రూపంలో వచ్చాయి. సింగపూర్ బౌలర్లలో హర్ష భరద్వాజ్ 6 వికెట్లు నేల కూల్చాడు.

హర్ష భరద్వాజ్ 4 ఓవర్లు వేశాడు. కేవలం మూడు రన్స్ మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు చేజిక్కించుకున్నాడు. అతడు వేసిన నాలుగు ఓవర్లలో రెండు ఓవర్లు మెయిడిన్ కావడం విశేషం. అక్షయ్ రెండు వికెట్లు సాధించాడు. రాహుల్, రమేష్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 11 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన సింగపూర్ జట్టు 9 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక వికెట్ మాత్రమే నష్టపోయి ఐదు బంతుల్లోనే మంగోలియా విధించిన లక్ష్యాన్ని ఛేదించింది.. సింగపూర్ జట్టు ఓపెనర్ మన్ ప్రీత్ సింగ్ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. సింప్సన్ రెండు బంతుల్లో ఒక ఫోర్ కొట్టి 6* గా నిలిచాడు. శర్మ రెండు బంతుల్లో ఒక సిక్సర్ సహాయంతో 7* పరుగులు చేశాడు. వీరిద్దరూ సింగపూర్ జట్టును కేవలం ఐదు బంతుల్లోనే విజయతీరాలకు చేర్చారు..

ఇక మంగోలియా చెత్త రికార్డులను తన పేరు మీద నమోదు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. పొట్టి ఫార్మాట్ క్రికెట్లో అతి తక్కువ పరుగులు చేసిన జట్టుగా.. అత్యధిక పరుగులు సమర్పించుకున్న జట్టుగా అత్యంత దారుణమైన ఘనతను సొంతం చేసుకుంది. నేపాల్ తో జరిగిన ఒక మ్యాచ్లో మంగోలియా 314 పరుగులు సమర్పించుకుంది. అంతేకాదు టి20 క్రికెట్లో అత్యధికంగా పరుగులు సమర్పించుకున్న జట్టుగా రికార్డ్ సృష్టించింది. ఇక స్పెయిన్ జట్టుతో జరిగిన ఒక మ్యాచ్లో ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు కేవలం పది పరుగులకే ఆలౌట్ కావడం విశేషం.. మంగోలియా అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం చెత్త రికార్డులను సృష్టించేందుకే ఐసీసీ మంగోలియా కు అవకాశం ఇస్తోందని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అనామకమైన ఆటగాళ్లకు ఎందుకు అవకాశాలు కల్పిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ” మరీ ఇంత దారుణంగా ఆడే జట్లతో క్రికెట్ ను ఎలా అభివృద్ధి చేస్తారంటూ” నెటిజన్లు ఐసీసీ ని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు.