Vaibhav Suryavanshi: పొట్టి ఫార్మాట్లో 15 సంవత్సరాల బుడతడు వైభవ్ సూర్య వంశీ సృష్టిస్తున్న సంచలనం అంచనాలకు అందనిది. ఐపీఎల్ 2026 లో సూర్య వంశీ అదరగొట్టాడు. 2:30 కి పైగా స్ట్రైక్ రేట్ తో ఏకంగా 776 పరుగులు చేశాడు. నారింజ రంగు టోపీని కూడా అందుకున్నాడు. ఆ స్థాయిలో ఆడిన ఇతడికి ఐర్లాండ్ టూర్ లో మేనేజ్మెంట్ ఆడే అవకాశం ఇవ్వలేదు.
అతడు ఆడకపోవడం.. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ విఫలం కావడంతో.. విమర్శకులు మరింతగా రెచ్చిపోతున్నారు. మేనేజ్మెంట్ మీద మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఐర్లాండ్ సిరీస్ కోల్పోవడంతో అభిమానుల ఆగ్రహం మరింత పెరుగుతోంది.. వైభవ్ సూర్య వంశీకి ఆడే అవకాశం ఇస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని మెజారిటీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు ఏ మాత్రం సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సూర్య వంశీని జట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణాన్ని అసిస్టెంట్ కోచ్ డస్కాటే బయటపెట్టాడు..”సరిగ్గా మూడు నెలల క్రితం టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్ అందించడానికి ప్రధాన కారణం సంజు శాంసన్. అతడు సీనియర్ ఆటగాడు. అతడికి ఐపిఎల్ లో అద్భుతమైన రికార్డు ఉంది. కొన్ని మ్యాచ్ లలో విఫలమైన మాత్రాన అటువంటి ఆటగాడిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. అతడిని మాత్రమే కాదు సీనియర్ ప్లేయర్లను పక్కన పెట్టబోము. ఆటగాళ్ల మీద పూర్తి నమ్మకం మాకుంది. వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. అటువంటి ప్లేయర్లకు సుదీర్ఘమైన అవకాశాలు కల్పించడమే మా ప్రధాన లక్ష్యమని”డస్కాటే వ్యాఖ్యానించడం విశేషం.
ఈ ప్రకారం సూర్య వంశీకి ఇంగ్లాండ్ టూర్ లో కూడా తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉండకపోవచ్చు. సంజు, అభిషేక్, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లలో ఎవరో ఒకరు గాయపడితేనే సూర్య వంశీకి చోటు లభిస్తుంది.. ఒకవేళ మేనేజ్మెంట్ అతడికి అవకాశం కల్పించాలి అంటే.. కొంతమంది ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ టూర్ రేపటి నుంచి మొదలవుతుంది కాబట్టి.. ఒకవేళ మేనేజ్మెంట్ దీర్ఘంగా ఆలోచించి ఎవరికో ఒకరికి విశ్రాంతి ఇస్తే.. అప్పుడు సూర్య వంశీ జట్టులో అడుగు పెడతాడు.. అతడు తుది జట్టులో చోటు దక్కించుకుంటాడా.. మైదానంలో సూర్య విహారం చేస్తాడా.. అనే ప్రశ్నలకు ఇంకా ఒకరోజు ఆగాలి. అప్పుడే వీటికి సమాధానం లభిస్తుంది.
