Tilak Varma Century: ఐపీఎల్ లో అత్యధిక సార్లు ట్రోఫీలు అందుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ కు పేరుంది. రోహిత్ నాయకత్వంలో ముంబై జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది. కానీ, కొంతకాలంగా ముంబై జట్టు ఆట తీరు అంత గొప్పగా లేదు. పేరు మోసిన ప్లేయర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఆటగాళ్ల మధ్య సమన్వయం లేకపోవడంతో జట్టు తగిన మూల్యం చెల్లించుకున్నది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో కూడా ముంబై జట్టు చెప్పుకునే స్థాయిలో ఆడలేకపోయింది. కేవలం ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించింది. రాజస్థాన్ నుంచి మొదలు పెడితే బెంగళూరు వరకు ప్రతి జట్టు చేతిలో ఓడిపోయింది.
హార్దిక్ పాండ్యా నాయకత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాటింగ్ కూర్పులు.. బౌలింగ్ మార్పుల విషయంలో ఏమాత్రం హార్దిక్ పాండ్యా తన స్థాయిని ప్రదర్శించలేకపోతున్న నేపథ్యంలో ముంబై జట్టు విజయాలు సాధించలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా నాయకత్వంలో విమర్శలు మళ్లీ మొదలయ్యాయి. 2024 నాటి పరిస్థితిని మళ్లీ హార్దిక్ పాండ్యా ఎదుర్కోవలసిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కు కాస్త ఉపశమనం లభించింది. సోమవారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఏకంగా 99 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తిలక్ వర్మ సెంచరీ చేయడం.. బుమ్రా తొలి బంతికే వికెట్ తీయడం.. అశ్విని కుమార్ నాలుగు వికెట్లు సొంతం చేసుకోవడం.. వంటి పరిణామాలతో ముంబై జట్టు సూపర్ విక్టరీని అందుకుంది. ఈ గెలుపుతో ముంబై జట్టు ఐపీఎల్లో పునరాగమనం గట్టిగా చేస్తుందా.. ఈ సంకేతాలు మొత్తం దానిని బలపరుస్తున్నాయని అభిమానులు అంటున్నారు. గతంలో ముంబై జట్టు ఇలాగే కొన్ని సందర్భాలలో ఓడిపోయింది. ఆ తర్వాత మళ్లీ టచ్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఆడుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా బౌలింగ్లో ముంబై బౌలర్లు సోమవారం నాటి గుజరాత్ మ్యాచ్లో సత్తా చూపించారు. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేసాడు. అశ్విని కుమార్ తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. హార్దిక్ పాండ్యానే దారుణంగా బౌలింగ్ వేశాడు. ఒక వికెట్ తీసినప్పటికీ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. గుజరాత్ జట్టు బ్యాటర్లు ఏ దశలో కూడా ముంబై బౌలర్లను ప్రతిఘటించలేకపోయారు. సాయి సుదర్శన్ నుంచి మొదలుపెడితే గిల్ వరకు ఏ ఒక్క ఆటగాడు కూడా సత్తా చూపించలేకపోయారు. ముంబై జట్టు విజయం సాధించిన నేపథ్యంలో మేనేజ్మెంట్ ఆనందంలో ఉంది. ఎందుకంటే వరుస ఓటముల తర్వాత దక్కిన విజయం కావడంతో సానుకూల దృక్పథం కనిపిస్తోంది. అయితే దీనిని ముంబై జట్టు వచ్చే మ్యాచ్లో కూడా కొనసాగించగలుగుతుందా.. హార్థిక్ పాండ్యా జట్టు ఆటగాళ్లలో స్ఫూర్తి నింపగలుగుతాడా.. విభేదాలకు చెక్ పెట్టగలుగుతాడా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.