Employee Union Politics: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవారు. ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం అనుకూలంగా ఉండేవారు. ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఏదో తూతూ మంత్రంగా గళం ఎత్తే వారు. చిన్నపాటి అనుకూల నిర్ణయం వస్తే చాలు అప్పటి ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు చేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల కోసం పనిచేయలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్నట్టు ఉండేది వారికి వ్యవహార శైలి. వారి ప్రకటనలు కూడా అలానే ఉండేవి. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా కొంతమంది ఉద్యోగ సంఘాల నేతల వైఖరి మారలేదు. ప్రధానంగా ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అయితే వైసీపీ కార్యకర్తల పని చేసేవారు. ఇప్పుడు కూడా అదే పని చేయడంతో ప్రభుత్వం సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది.
* వైసీపీకి బాహటంగా..
2019 నుంచి 2024 మధ్య వెంకట్రామిరెడ్డి( Venkat Rama Reddy ) ఉద్యోగ సంఘం ముసుగులో ఎంతలా రాజకీయం చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం కూడా చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయాల్లో జోక్యం చేసుకునేవారు. దీనిపై కూటమి ప్రభుత్వం విచారణ కూడా చేపట్టింది. 2024 ఎన్నికల సమయంలో కడప జిల్లా బద్వేలు లో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని బహిరంగంగా ప్రచారం చేశారు.. దీనిపై అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అందుకు తగ్గ ఆధారాలు కూడా చూపించారు. దీనిపై విచారణ జరిపిన అప్పటి కడప జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా.. అప్పట్లోనే పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ పదవి నుంచి సస్పెండ్ చేశారు.
* సస్పెన్షన్ తర్వాత కూడా..
అయితే సస్పెండ్ అయిన తరువాత కూడా వెంకట్రామిరెడ్డి తీరులో మార్పు రాలేదు. హెడ్ క్వార్టర్స్ లో ఉండాలనే నిబంధన కూడా ఆయన పట్టించుకోలేదు. ఆపై కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతర ఉద్యోగులను ప్రభావితం చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సంక్షేమం కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యం అన్నట్టు వ్యవహరించారు. మందు పార్టీలు ఏర్పాటు చేసి ఉద్యోగులను ప్రలోభ పెట్టారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. గత ప్రభుత్వంతో అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ.. ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయాలు చేస్తూ.. ఉద్యోగ సర్విస్ నిబంధనల ఉల్లంఘన, విధుల దుర్వినియోగం వంటివి ఆయన నుంచి కనిపించాయి. అందుకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేలా ఆయన పై వేటు వేసింది ప్రభుత్వం. ఉద్యోగ సంఘాల ముసుగులో ఎలా ఉండకూడదు వెంకట్రామిరెడ్డి వ్యవహరించు చూపించారు. ఆయనను మరొక్కరు అనుసరించకుండా ఉండేలా ప్రభుత్వం గట్టి చర్యలకు దిగింది.