FIFA financial crisis: ప్రపంచంలో ఎక్కువమంది ఆడే ఆట ఫుట్ బాల్. సాకర్ కప్ వచ్చిందంటే చాలు అమెరికా నుంచి మొదలు పెడితే అర్జెంటీనా వరకు. ఫుట్ బాల్ ఫీవర్ తో ఊగిపోతాయి. రోనాల్డో నుంచి మొదలు పెడితే ఎంబాపే వరకు అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఆట మాత్రమే కాకుండా.. వ్యాపార పరంగా కూడా సాకర్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ఉంటుంది. వేల కోట్ల బిజినెస్ ఈ క్రీడ చుట్టూ సాగుతూ ఉంటుంది.
అంతటి స్థాయి ఉన్న ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఇప్పుడు స్థాయిని కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ టోర్నీ హక్కుల కోసం బ్రాడ్కాస్టర్లు ముందుకు రావడంలేదని ప్రచారం జరుగుతోంది. మనదేశంలో ప్రసార హక్కులు ఇంకా ఫైనల్ కాలేదు. వెస్ట్ బెంగాల్, కేరళ, త్రిపుర, అస్సాం, నాగాలాండ్ వంటి రాష్ట్రాలలో ఫుట్ బాల్ ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఇక్కడ జాతీయ జట్టు ఆడిన ప్లేయర్లు కూడా ఉన్నారు. పైగా మనదేశంలో ఫుట్బాల్ మ్యాచ్లకు ఆదరణ భారీగానే ఉంటుంది. దీనికి తోడు ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న మనదేశంలో మార్కెట్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ ఫుట్బాల్ ప్రపంచ కప్ విషయంలో బ్రాడ్కాస్టర్లు అతగా ఆసక్తిగా లేరు. రిలయన్స్, డిస్నీ వెంచర్ బ్రాడ్కాస్టింగ్ హక్కుల కోసం 20 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసింది. అయినప్పటికీ ఫిఫా ఒప్పుకోలేదు. తక్కువలో తక్కువ 100 మిలియన్ డాలర్లను అంచనా వేస్తోంది. చివరికి 60 మిలియన్ డాలర్ల సొమ్మును రాబట్టుకోవాలని భావిస్తుంది. అయితే పరిస్థితి అలా లేదు. మిగతా సంస్థలు పోటీలోకి రావడం లేదు. ఒకవేళ డీల్ కుదరకపోతే.. జూన్ 11న ప్రారంభమయ్యే ఈ టోర్నీని భారత దేశంలో ఫ్యాన్స్ లైవ్ లో చూసే అవకాశం ఉండదు. జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం యూట్యూబ్ లేదా.. ఇతర మాధ్యమాలలో స్ట్రీమింగ్ చేస్తామని ఫిఫా చెబుతోంది. అయితే 20 మిలియన్ డాలర్లకు మించి తాము ఖర్చు పెట్టలేదని ఇప్పటికే జియో హాట్ స్టార్ ప్రతినిధులు చెప్పినట్టు తెలుస్తోంది.
ఇతర దేశాలలో ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.. ఆయా దేశాలలో వివిధ బ్రాడ్కాస్టర్లకు ఫిఫా ప్రసార హక్కులు అమ్మింది. వాటి ద్వారా భారీగానే రాబట్టుకుంది. కానీ ఇండియన్ మార్కెట్ లోనే ఫిఫా అనుకున్నంత డబ్బు రావడం లేదు.
