Paris Olympics 2024 : జర్మనీ చేతిలో ఓడినా.. భారత్ హాకీ జట్టుకు పతకం గెలిచే అవకాశం.. ఎలాగంటే

జర్మనీ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 2-3 తేడాతో ఓడిపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఆట ప్రారంభమైన ఏడవ నిమిషంలో భారత్ గోల్ సాధించినప్పటికీ.. చివరి వరకు జోరు కొనసాగించలేకపోయింది. ఆట ఏడవ నిమిషంలో భారత జట్టు తరఫున హార్మోన్ ప్రీత్ సింగ్, 36 వ నిమిషంలో సుఖ్ జీత్ చెరో గోల్ సాధించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 7, 2024 11:23 am
Follow us on

Paris Olympics 2024  : హాకీ మన దేశ జాతీయ క్రీడ అయినప్పటికీ.. విశ్వ క్రీడా పోటీల్లో 1980 తర్వాత.. భారత జట్టు ఫైనల్స్ చేరుకోలేదు. పైగా రోజురోజుకు హాకీలో భారత జట్టు ఆట తీరు మరింత నాసిరకంగా మారింది. దారుణమైన ప్రదర్శన వల్ల గ్రూప్ దశ కూడా దాటలేకపోయింది. దీంతో ఇక పూర్వ వైభవం రాదని.. వచ్చే అవకాశం లేదని అందరూ అనుకున్నారు. చరిత్ర మొత్తం గతమే అని భావించారు. కానీ భారత హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో ఆశలు రేపింది. వెంట్రుక వాసిలో ఫైనల్ బెర్త్ కోల్పోయింది. కాంస్య పతకం సాధించి ఎదురుచూపుకు ఎండ్ కార్డు వేసింది. అయితే పారిస్ గురించి మాత్రం భారత హాకీ జట్టు కనివిని ఎరుగని స్థాయిలో జోరు చూపించింది. ఈసారి బంగారు పతకం ఖాయం అనిపించింది. జర్మనీతో జరిగిన సెమీస్ మ్యాచ్ లో ఆట మొదలైన ఏడు నిమిషాలకే భారత్ గోల్ కొట్టింది. దీంతో భారత జట్టు గెలుపు సాధిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే చివరికి ఓటమే మిగలడంతో మళ్లీ నిరాశే ఎదురయింది. భారత జట్టు పెనాల్టీ కార్నర్లను ఏమాత్రం వినియోగించుకోలేకపోయింది. దీంతో జర్మనీ ఎదుట తలవంచాల్సి వచ్చింది.

అభిమానుల్లో నిరాశ

జర్మనీ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 2-3 తేడాతో ఓడిపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఆట ప్రారంభమైన ఏడవ నిమిషంలో భారత్ గోల్ సాధించినప్పటికీ.. చివరి వరకు జోరు కొనసాగించలేకపోయింది. ఆట ఏడవ నిమిషంలో భారత జట్టు తరఫున హార్మోన్ ప్రీత్ సింగ్, 36 వ నిమిషంలో సుఖ్ జీత్ చెరో గోల్ సాధించారు. జర్మనీ జట్టులో ఆట 18వ నిమిషంలో గొంజాలో, 27వ నిమిషంలో క్రిస్టోఫర్, 54 నిమిషంలో మార్కో గోల్స్ చేశారు. దీంతో భారత్ ఓడిపోవాల్సి వచ్చింది. భారత్ చివరిసారిగా 1980లో జరిగిన ఒలింపిక్స్ లో ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ప్రస్తుతం భారత్ కాంస్య పతకం కోసం స్పెయిన్ జట్టుతో తలపడాల్సి ఉంది..

దూకుడుగా ఆట ప్రారంభించినప్పటికీ..

వాస్తవానికి భారత్ గొప్ప పోరాటం చేసి క్వార్టర్స్ లో విజయం సాధించింది. సెమీస్ లోనూ దూకుడుగా ఆట ప్రారంభించింది. రెండవ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించినప్పటికీ వినియోగించుకోలేకపోయింది. ఆ తర్వాత మరో పెనాల్టీ కార్నర్ కూడా వచ్చినప్పటికీ వృధా అయ్యింది. ఎటాకింగ్ ఆటతీరుతో అలరించి.. వరుస పెనాల్టీ కార్నర్లు సాధించింది. వాటిని గోల్స్ లా మలచలేకపోయింది. ఇదే సమయంలో ఆట ఏడవ నిమిషంలో గోల్ సాధించింది. హర్మన్ ప్రీత్ కొట్టిన షాట్ గోల్ గా మారడంతో భారత్ లీడ్ లోకి వెళ్ళింది.

అదే జోరు కొనసాగించలేకపోయింది

ఆట మొదటి క్వార్టర్ లో భారత్ తిరుగులేని లీడ్ కొనసాగించింది. రెండవ క్వార్టర్లో అదే జోరు కొనసాగించలేకపోయింది. ఇదే సమయంలో జర్మనీ పుంజుకుంది. క్వార్టర్ మొదట్లోనే పెనాల్టీ కార్నర్ ను జర్మనీ ఆటగాడు గొంజా గోల్ గా మలచడంతో రెండు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఈ క్రమంలో ఆట ఇరవై నిమిషంలో భారత్ కు గోల్ సాధించే అవకాశం వచ్చింది. అయితే అభిషేక్ కొట్టిన షాట్ ను జర్మనీ ఆటగాడు మల్లెర్ అడ్డుకున్నాడు. ఇదే సమయంలో జర్మనీ ఒక పెనాల్టీ కార్నర్ దక్కించుకుంది. దానిని క్రిస్టోఫర్ గోల్ గా మలిచాడు.

వినియోగించుకోలేకపోయాడు

ద్వితీయార్థంలో భారత జట్టుకు గోల్ కొట్టే అవకాశం లభించింది. అయితే దానిని జర్మనీ గోల్ కీపర్ డేన్ బర్గ్ అడ్డగించాడు. ఆట 36 నిమిషంలో సుఖ్ జీత్ గోల్ సాధించడంతో 2-2 తో స్కోర్లు సమమయ్యాయి. ఆట 53వ నిమిషం వరకు రెండు జట్లు సమానంగా ఉన్నాయి. చివర్లో భారత జట్టు తడబాటుకు గురికావడంతో జర్మనీ లీడ్ లోకి వెళ్ళింది. మార్కో సాధించిన గోల్ తో జర్మనీ 3-2 ఆధిక్యంలోకి వెళ్ళింది. చివర్లో స్కోరు సమం చేసేందుకు అవకాశం లభించినప్పటికీ భారత జట్టు ఆటగాడు షంషేర్ వినియోగించుకోలేకపోయాడు.