CM Chandhrababu :  ఆ రెండు పదవులు టిడిపికే.. జనసేనకు నో ఛాన్స్.. పవన్ కు షాకిచ్చిన చంద్రబాబు!

కూటమి పాలనకు రెండు నెలలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఇతర నియామకాలు, నామినేటెడ్ పోస్టులపై ప్రభుత్వం దృష్టి సారించింది. వాటి భర్తీకి కసరత్తు చేస్తోంది.

Written By: Dharma, Updated On : August 7, 2024 11:41 am
Follow us on

CM Chandhrababu : ప్రభుత్వంలో పెండింగ్ పదవులపై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. అటు నామినేటెడ్ పదవుల విషయంలో సైతం ఒక స్పష్టతకు వస్తోంది. టీటీడీ తో సహా అన్ని కీలక పదవులపై చంద్రబాబు ఒక క్లారిటీకి వస్తున్నారు.పవన్ తోచర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. అత్యంత కీలకంగా భావించే టిటిడి చైర్మన్ పదవి విషయంలో ఎప్పటికీ ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.తాజాగా డిప్యూటీ స్పీకర్ తో పాటు చీఫ్ విప్ పదవికి పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం.జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న సీఎంతో పాటు మంత్రులు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత అసెంబ్లీ సమావేశాలు జరిపి స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎంపిక చేశారు. పెను వెంటనే డిప్యూటీ స్పీకర్ పదవిని సైతం భర్తీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ వివిధ సమీకరణల దృష్ట్యా అప్పట్లో పెండింగ్ పెట్టారు. ఇప్పుడు రెండు నెలలు సమీపిస్తుండడంతో డిప్యూటీ స్పీకర్ పోస్ట్ తో పాటు చీఫ్ విప్, ఇతర విప్ పదవుల భర్తీపై దృష్టి సారించారు. డిప్యూటీ స్పీకర్ గా కాల్వ శ్రీనివాసులు ఎంపిక చేశారు. చీఫ్ విప్ గా జీవి ఆంజనేయులు పేరును ఖరారు చేశారు. కూటమిలో 135 అసెంబ్లీ సీట్లు రావడంతో టిడిపికే చీఫ్ విప్ పదవి కేటాయించాల్సి వచ్చింది. డిప్యూటీ స్పీకర్ పదవికి చాలా పేర్లు వినిపించాయి. కానీ చంద్రబాబు మాత్రం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వైపు మొగ్గు చూపారు. ఉత్తరాంధ్రకు స్పీకర్ పదవి కేటాయించడంతో.. రాయలసీమకు డిప్యూటీ స్పీకర్ పదవి ప్రకటించినట్లు తెలుస్తోంది.

* సీనియర్ల ఆశలు
తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్లు మంత్రి పదవులు ఆశించారు. క్యాబినెట్లో చోటు దక్కుతుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈసారి క్యాబినెట్లో కొత్తవారిని తీసుకున్నారు చంద్రబాబు. దాదాపు పది మంది వరకు కొత్తగా శాసనసభకు ఎన్నికైన వారే. దీంతో పార్టీలో సీనియర్లలో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అయింది. అయితే కూటమి ప్రభుత్వం ఉన్న దృష్ట్యా ఆ నిర్ణయం తప్పనిసరిగా మారింది.

* ఆశావహులు ఎక్కువే
అయితే క్యాబినెట్ తో సమానమైన హోదా అయిన చీఫ్ విప్ పదవిపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ధూళిపాళ్ల నరేంద్రకు ఆ పదవి దక్కుతుందని అందరూ ఒక అంచనాకు వచ్చారు. అయితే పలనాడు జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేకపోవడంతో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చీఫ్ విప్ గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి ధూళిపాళ్ల నరేంద్ర తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకు ఛాన్స్ దక్కలేదు. పోనీ చీఫ్ విప్ పదవితో సంతృప్తి పరుస్తారు అనుకుంటే.. అది కూడా దక్కకుండా పోయింది.

* 14 మందికి విప్ పోస్టులు
ఇక విప్ పదవులకు సంబంధించి 14 మందికి అవకాశాలు దక్కనున్నాయి. మూడు పార్టీల మధ్య సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి ఇప్పటికే నలుగురు పేర్లను పవన్ సిఫారసు చేశారు. పార్టీ ఫ్లోర్ లీడర్ గా మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన చీఫ్ విప్ గా లోకం మాధవిని నియమించనున్నారు. మరో ఇద్దరు జనసేన నుంచి విప్ లుగా నియమితులు కానున్నారు. బిజెపి నుంచి చీఫ్ విప్ గా సుజనా చౌదరి పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ఫ్లోర్ లీడర్ గా విష్ణుకుమార్ రాజు నియమితులయ్యారు. టీటీడీ బోర్డుతో పాటుగా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల పైన ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.