Homeక్రీడలుIndia Vs England: ధృవ్ 90 పరుగులు.. ఇదీ పుత్రోత్సాహం అంటే..

India Vs England: ధృవ్ 90 పరుగులు.. ఇదీ పుత్రోత్సాహం అంటే..

India Vs England: 219 పరుగులకు ఏడు వికెట్లు.. కీలక బ్యాటర్లు మొత్తం పెవిలియన్ చేరుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్ బషీర్ నాలుగు వికెట్లు తీసి జోరు మీద ఉన్నాడు. అప్పటికి ప్రత్యర్థి జట్టు కంటే 144 పరుగుల వెనుకంజలోనే.. క్రీజ్ లో ఉన్నది ధృవ్, కులదీప్ యాదవ్.. ఇది ఆదివారం మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు ముందు భారత్ పరిస్థితి. ఈ దశలో రోహిత్ సేనకు ఎటువంటి ఆశలు లేవు. మహా అయితే 20 పరుగులకు జట్టు ఆల్ అవుట్ అవుతుందనే అంచనాలో ఉన్నారు. కానీ ఆ అనుమానాలను యువ వికెట్ కీపర్ పటాపంచలు చేశాడు. కష్టకాలంలో జట్టుకు ఆపద్బాంధవుడిగా నిలిచాడు.

రాంచి వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ ఇండియాకు వికెట్ కీపర్ ధృవ్ రక్షకుడిగా మారాడు. ఒక్క యశస్వి జైస్వాల్ (73) మినహా మిగతా బ్యాటర్లు మొత్తం విఫలం కావడంతో భారత జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ క్రమంలో జట్టు భారాన్ని ధృవ్ తనపై వేసుకున్నాడు. తన కెరియర్ లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. 10 పరుగుల దూరంలో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ.. భారత్ పై ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని 46 పరుగులకు తగ్గించాడు. రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్న ఇంగ్లాండు బౌలర్లను కాచుకుంటూ 8 వికెట్ కు కులదీప్ యాదవ్ తో కలిసి 76, ఆకాష్ తో 9 వికెట్ కు 40, సిరాజ్ తో కలిసి చివరి వికెట్ కు 14 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పి ఇండియా స్కోర్ ను 307 పరుగులకు చేర్చాడు. వ్యక్తిగత స్కోరు 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు హార్ట్ లీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నాడు.. సెంచరీ చేజారిపోయినప్పటికీ టీమిండియాను ధృవ్ పటిష్ట స్థితిలోనే నిలిపాడు.. తొలి ఇన్నింగ్స్ లో జైస్వాల్ మినహా మిగతా బ్యాటర్లు మొత్తం చేతులు ఎత్తేసినప్పటికీ ధృవ్ మాత్రం అడ్డుగోడలా నిలబడ్డాడు. ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ భారత స్కోర్ ను ముందుకు నడిపించాడు.

ధృవ్ నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 90 పరుగులు చేసి ఇండియాకు ఆపద్బాంధవుడిగా నిలవడం పట్ల అతని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అతడి తండ్రి కన్నీటి పర్యంతమవుతున్నాడు. ధృవ్ తండ్రి భారత సైన్యంలో సైనికుడిగా పని చేశాడు. కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైన్యంలో పనిచేసి పాకిస్తాన్ పై ఇండియా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు.ధృవ్ ను క్రికెట్ వైపు వెళ్లొద్దని అతడి తండ్రి హెచ్చరించేవాడట. కానీ ధృవ్ అందులోనే నైపుణ్యం సంపాదించాడు. అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించాడు. ఒకానొక దశలో క్రికెట్ కిట్ కొనేందుకు డబ్బులు లేక ధృవ్ ఇబ్బంది పడుతుండగా.. తన కొడుకు పడుతున్న బాధను చూడలేక ధృవ్ తల్లి తన నగలు అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చింది. అప్పటినుంచి అతడు మైదానంలో తీవ్రంగా సాధన చేశాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో స్థానం దక్కించుకున్నాడు. నాలుగో టెస్టులో ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్బాంధవుడి అవతారం ఎత్తి 90 పరుగులు చేశాడు. పది పరుగుల దూరంలో సెంచరీ కోల్పోయినప్పటికీ.. కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలిచాడు.

కాగా తొలి ఇన్నింగ్స్ లో భారత్ 307 పరుగులకు ఆల్ అవుట్ అయింది. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 19 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్ చివరి రెండు బంతుల్లో రవిచంద్రన్ అశ్విన్ డకెట్, పోప్ ను ఔట్ చేశాడు. డకెట్ సర్ఫ రాజ్ పట్టిన క్యాచ్ తో ఔట్ కాగా, పోప్ వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రావ్ లే, రూట్ క్రీజ్ లో ఉన్నారు. 8 ఓవర్లు ముగిసే నాటికి ఇంగ్లాండ్ రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version