CSK vs RR : సన్ రైజర్స్ ను చెన్నై మామూలు దెబ్బ కొట్టలేదుగా.. ప్లే ఆఫ్ ముందు ఎంటీ ట్విస్ట్?

ఈ విజయంతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి వెళ్లిపోయింది. ఇప్పటిదాకా ఈ స్థానంలో హైదరాబాద్ ఉంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా మారింది.

Written By: NARESH, Updated On : May 12, 2024 9:56 pm

CSK vs RR

Follow us on

CSK vs RR : ఐపీఎల్ ఉత్కంఠంగా సాగుతోంది. ప్లే ఆఫ్ ముందు రకరకాల సమీకరణాలు అటు ఆటగాళ్లనే కాదు, ఇటు అభిమానులను ముని వేళ్ళ మీద నిలబెడుతున్నాయి. ఆదివారం చెపాక్ వేదికగా రాజస్థాన్ జట్టుతో చెన్నై తలపడింది. ఈ మ్యాచ్లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ విజయం ద్వారా హైదరాబాద్ జట్టును చెన్నై వెనక్కి నెట్టింది. పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరుకుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన చెన్నై 7 విజయాలు అందుకుంది. 14 పాయింట్లు సాధించింది.

చెపాక్ మైదానం స్లో పిచ్ కు ప్రతీక . ఈ మైదానంపై ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకు పెద్దగా అడ్వాంటేజ్ ఉండదు. అయితే ఈ విషయాన్ని మర్చిపోయి రాజస్థాన్ జట్టు టాస్ గెలవడమే ఆలస్యం బ్యాటింగ్ ఎంచుకుంది. భయంకరమైన లైనప్ ఉన్నప్పటికీ రాజస్థాన్ ఆటగాళ్లు 20 ఓవర్లలో 141 రన్స్ మాత్రమే చేశారు. రియాన్ పరాగ్ 35 బంతుల్లో 47*, ధృవ్ జురెల్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. యశస్వి జైస్వాల్ 24, బట్లర్ 21 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో సమర్జిత్ సింగ్ 3 వికెట్లు, తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు పడగొట్టి రాజస్థాన్ పతనాన్ని శాసించారు.

142 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై 18.2 ఓవర్స్ లో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. చెన్నై ఓపెనర్ రచిన్ రవీంద్ర 18 బంతుల్లో 27, మిచెల్ 13 బంతుల్లో 22, శివం దుబే 11 బంతుల్లో 18, కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ 42* పరుగులు చేయడంతో చెన్నై విజయాన్ని దక్కించుకుంది. రాజస్థాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2, బర్గర్, చాహల్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.

స్లో గా ఉన్న ఈ మైదానంపై చెన్నై లక్ష్యసాధనను ధాటిగా ప్రారంభించింది. గైక్వాడ్ జాగ్రత్తగా ఆడితే.. రవీంద్ర దూకుడు మంత్రాన్ని ఎంచుకున్నాడు. అయితే ఇతడు ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు. నాలుగో ఓవర్ లో రవిచంద్రన్ అశ్విన్ కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిచెల్ కూడా దూకుడుగా ఆడాడు. అయితే చెన్నై ఆటగాళ్ల దూకుడుకు చాహల్ కళ్లెం వేశాడు. ఏడో ఓవర్లో మిచెల్ ను అవుట్ చేశాడు.. ఆవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ పరుగులు ఇవ్వకుండా చెన్నై ఆటగాళ్లను ముప్పు తిప్పలు పెట్టారు. ఇదే సమయంలో చెన్నై ఆటగాడు మోయిన్ అలీ ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో శివం దుబే ధాటిగా ఆడటంతో మ్యాచ్ చెన్నై చేతుల్లోకి వచ్చింది. అయితే అతడు అశ్విన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో మైదానంలోకి జడేజా వచ్చాడు. అతడు ఏడు బంతుల్లో ఐదు పరుగులు చేశాడు. “అబ్ స్ట్రక్టింగ్ దీ ఫీల్డ్ ” వల్ల అతడు ఔట్ అయ్యాడు. ఈ దశలో సమీర్ రిజ్వి 15, రుతు రాజ్ గైక్వాడ్ చెన్నై జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి వెళ్లిపోయింది. ఇప్పటిదాకా ఈ స్థానంలో హైదరాబాద్ ఉంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా మారింది.