కరోనావైరస్ మహమ్మారి రెచ్చిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. అందరిపైనా ప్రభావం చూపుతోంది. ఇప్పుడు క్రికెటర్లను సైతం కరోనా వెంటాడుతోంది. మొన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, పఠాన్ సోదరులు (యూసుఫ్, ఇర్ఫాన్) కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. భారత మహిళల జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సైతం కరోనా బారిన పడ్డారు. ఇక మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ సీజన్ కోసం రెడీ అవుతున్న క్రికెటర్లకూ కరోనా సోకింది.
ఐపీఎల్ అంటేనే సిక్సర్లు, ఫోర్లు.. ఉత్కంఠ పోరు. ఐపీఎల్ వస్తోందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులకు పండగే. కానీ.. ఈసారి ఐపీఎల్పై కరోనా ప్రభావం గట్టిగానే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్తోపాటు లీగ్తో సంబంధమున్న మరో 20 మంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆర్సీబీ శిబిరంలో కలవరపాటు మొదలైంది. ప్రస్తుతం అతడిని ప్రత్యేక ఐసోలేషన్లో ఉంచినట్లు తెలుస్తోంది.
గతేడాది ఐపీఎల్లో బెంగళూరు తరఫున ఆడిన దేవ్దత్ అరంగేట్రం సీజన్లోనే అదరగొట్టాడు. 15 మ్యాచుల్లో 31.53 సగటుతో 473 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల దేశవాళి క్రికెట్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆరు మ్యాచుల్లో 43.60 సగటుతో 218 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో మరింత రెచ్చిపోయాడు. మొత్తం 737 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు కరోనా బారిన పడడంతో శుక్రవారం ముంబయి ఇండియన్స్తో ఆర్సీబీ తలపడే తొలి మ్యాచ్లో పడిక్కల్ ఆడడం కుదరకపోవచ్చు.
మొత్తంగా క్రికెటర్లు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతుండడంతో ఫ్రాంచైజీలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ఏ జట్టు నుంచి ఇంకా ఎంత మంది ఈ వైరస్ బారిన పడుతారోనని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఈసారి ఐపీఎల్ సీజన్ను చాలెంజ్గా తీసుకొని పలువురు క్రికెటర్లకు భారీ మొత్తంలో ముట్టజెప్పి మరీ కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో వైరస్ ఏం చేస్తుందా చూడాలి మరి. అటు క్రికెట్ ప్రేమికులు కూడా ఐపీఎల్ పై ఆశలతో ఉన్నారు.