Team India Coach : అలా అయితేనే కోచ్ పదవి చేపడతా.. బీసీసీఐకి గంభీర్ అల్టిమేటం

Team India Coach వాస్తవానికి గౌతమ్ గంభీర్ కంటే కోచ్ పదవి రేసు లో రవి శాస్త్రి, వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నారని వార్తలు వినిపించాయి. అయితే వారు దానికి సిద్ధంగా లేకపోవడంతో, బిసిసిఐ సెక్రటరీ జై షా గౌతమ్ గంభీర్ ను సంప్రదించారు. దీనికి అతడు సమ్మతం తెలిపాడు.

Written By: NARESH, Updated On : June 16, 2024 9:03 pm
Follow us on

Team India Coach : టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవి కాలం మరి కొద్ది రోజుల్లో ముగియ బోతుంది. రాహుల్ తర్వాత ఎవరు? అనే ప్రశ్నకు బీసీసీఐ సమాధానం చెప్పేసింది. కొన్నాళ్లపాటు మీడియాలో నానిన గౌతమ్ గంభీర్ పేరును బీసీసీఐ ఓకే చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్ కతా జట్టుకు మెంటార్ గా పని చేసి.. ఆ జట్టును విజేతగా నిలిపిన గౌతమ్ గంభీర్ టీమిండియా కొత్త కోచ్ గా రానున్నాడు. అతడి నియామకాన్ని బిసిసిఐ అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది.. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ .. గౌతమ్ గంభీర్ బీసీసీఐ ఎదుట పెడుతున్న షరతులు సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.

హెడ్ కోచ్ గా తాను రావాలి అంటే.. నచ్చిన సహాయక సిబ్బందిని తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని గంభీర్ బిసిసిఐ ని పట్టుబడుతున్నాడట. వారిపై ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకూడదని చెప్పేశాడట. తాను చెప్పిన విధంగానే జీతభత్యాలు ఇవ్వాలని కోరాడట. దీనికి బిసిసిఐ వర్గాల నుంచి ఆమోదముద్ర లభించిందట..” గంభీర్ తో చర్చలు దాదాపుగా పూర్తయ్యాయి. అతడు మాకు కొన్ని విషయాలు చెప్పాడు. వాటికి మేము కూడా సమ్మతం తెలిపాం.. రకరకాల ఊహాగానాలు ఏవో వినిపిస్తున్నాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. కొద్ది రోజుల్లోనే రాహుల్ ద్రావిడ్ అనంతరం గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా అవతారం ఎత్తుతాడని” బిసిసిఐ వర్గాలు అంటున్నాయి.

ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ సైతం భారత క్రికెట్ జట్టు కోచ్ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ” టీమిండియా కు ప్రధాన శిక్షకుడిగా ఉండడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఆ స్థానాన్ని నేను చాలా ఇష్టపడతాను. ప్రపంచవ్యాప్త వేదికలపై 140 కోట్ల మంది భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు నేను ప్రతినిధిగా ఉంటున్నానంటే గొప్ప విషయమే కదా అని” గౌతమ్ వ్యాఖ్యానించాడు. ఇక ప్రస్తుతం గౌతమ్ గంభీర్ కోల్ కతా జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. ఆటగాడిగా కూడా గౌతమ్ గంభీర్ కు గొప్ప రికార్డు ఉంది. టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ లో జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్ కతా జట్టుకు ఏడు సీజన్ల పాటు సారధిగా వ్యవహరించాడు. 2012, 2014 సీజన్లో కోల్ కతా జట్టును విజేతగా ఆవిర్భవించేలా చేశాడు.. మెంటార్ గా కోల్ కతా జట్టును 2024 సీజన్లో విజేతగా నిలిపాడు. మాట పడని తత్వం, దూసుకెళ్లే గుణం, కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం ఉన్న గౌతమ్ గంభీర్ భారత జట్టును సమర్థవంతంగా నిలుపుతాడని బీసీసీఐ భావిస్తోంది. వాస్తవానికి గౌతమ్ గంభీర్ కంటే కోచ్ పదవి రేసు లో రవి శాస్త్రి, వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నారని వార్తలు వినిపించాయి. అయితే వారు దానికి సిద్ధంగా లేకపోవడంతో, బిసిసిఐ సెక్రటరీ జై షా గౌతమ్ గంభీర్ ను సంప్రదించారు. దీనికి అతడు సమ్మతం తెలిపాడు.