Abhishek Sharma T20 World Cup Duck Out: టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాకముందు చాలామంది అభిషేక్ శర్మ గురించి కామెంట్లు చేశారు. ప్రత్యర్థి జట్లు అతడిని ఎదుర్కోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. టీమిండియా కు బలమైన ఆటగాడు దొరికాడని.. స్వదేశంలో టి20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో అతడి దూకుడు మామూలుగా ఉండదని పేర్కొన్నారు.
వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ అభిషేక్ శర్మ ఆడుతున్నాడు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన అతడు పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ కు అందుబాటులోకి వచ్చాడు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు 0 పరుగులకు అవుట్ అయ్యాడు. అంతకుముందు అమెరికా జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా 0 పరుగులకు అవుట్ అయ్యాడు. తాజాగా నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా 0 పరుగులకు అవుట్ అయ్యాడు.
వరుసగా మూడు మ్యాచ్లలో అవుట్ కావడంతో అభిషేక్ శర్మ మీద ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. అభిషేక్ శర్మ తన లయను అందుకోవాలని.. అనవసరమైన ఒత్తిడిని తగ్గించుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. ముందుగా తన లోపాలపై దృష్టి సారించాలని.. వాటిని తగ్గించుకుంటే అభిషేక్ శర్మకు తిరిగి ఉండదని అభిమానులు పేర్కొంటున్నారు.
అభిషేక్ శర్మ గత ఏడు ఇన్నింగ్స్ లలో ఐదుసార్లు డక్ ఔట్ అయ్యాడు. ఒకసారి 30 పరుగులు.. మరోసారి 68* పరుగులు చేశాడు. ఇక ప్రస్తుత టి20 ప్రపంచ కప్ లో మూడు మ్యాచ్లలో వరుసగా డక్ అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ తన తొలి మ్యాచ్లో డక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత అతడు సున్నా ముఖమే చూడలేదు.
ఇప్పుడు అభిషేక్ శర్మ రెండు నెలల వ్యవధిలో ఐదుసార్లు సున్నా పరుగులు చేశాడు. దీనికి ఒక కారణం ఉంది.. అతడు మైదానంలోకి దిగడమే ఆలస్యం.. భారీగా షాట్లు కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. పిచ్ ను పరిశీలించకుండా.. వాతావరణాన్ని అంచనా వేయకుండా.. బౌలర్ ఎవరనేది పట్టించుకోకుండా.. బంతి కనిపిస్తే చాలు బలంగా కొట్టి.. స్టాండ్స్ అవతలికి పంపించాలని అనుకుంటున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో అభిషేక్ శర్మ మూడుసార్లు డక్ అవుట్ కావడం మింగుడు పడని పరిణామం అయితే.. మూడుసార్లు కూడా భారీ షాట్లు కొట్టడానికి ప్రయత్నించినవే కావడం విశేషం. అనవసరమైన ఒత్తిడిని అభిషేక్ శర్మ తగ్గించుకుంటే.. అతడికి తిరుగు ఉండదని అభిమానులు చెబుతున్నారు. క్రికెట్ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.