Saraswathi Antya Pushkaralu: సరస్వతీ నది అంత్య పుష్కరాలకు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 20 అర్ధరాత్రి నుంచి పుష్కర ఘట్టం ప్రారంభం కానుండగా.. మే 21 తెల్లవారుజామున 5.30 గంటలకు తొలి పుష్కర స్నానాలు నిర్వహించనున్నారు. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని గోదావరి నది సంగమం వద్ద పుష్కర స్నానం సరస్వతి అంత్య పష్కరాలు సాగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.30 కోట్లతో ఘాట్లు, రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్య సదుపాయాలను అభివృద్ధి చేసింది. సుమారు 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రాకపోకల కోసం RTC 3,360 ప్రత్యేక బస్సులను నడపనుంది. గవర్నర్, సీఎం, మంత్రులకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు.
హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. గురుగ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించినప్పుడు ఆయా నదులకు పుష్కర మహోత్సవాలు ప్రారంభమవుతాయి. గురుడు మిథున రాశిలో ప్రవేశించడంతో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పుష్కరాల మొదటి 12 రోజులను “ఆది పుష్కరాలు”, చివరి 12 రోజులను “అంత్య పుష్కరాలు”గా పరిగణిస్తారు.
ఈసారి సరస్వతీ ఆది పుష్కరాలు 2025 మే 15 నుంచి 2025 మే 26 వరకు ఘనంగా జరిగాయి. ఇప్పుడు అంత్య పుష్కరాలు 2026 మే 20 నుంచి 2026 మే 31 వరకు నిర్వహించనున్నారు. ఆది పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు కాళేశ్వరంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాల్లో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇప్పుడు అంత్య పుష్కరాలకు కూడా అదే స్థాయిలో భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సరస్వతీ నది హిందూ ధర్మంలో జ్ఞానం, విద్య, వాక్పటిమకు ప్రతీకగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం సరస్వతీ నది దివ్య నదిగా, అదృశ్యంగా ప్రవహించే పవిత్ర తీర్థంగా చెప్పబడింది. కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతీ సంగమమవుతుందని భక్తుల విశ్వాసం. అందుకే అక్కడ స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భావిస్తారు.
సరస్వతీ పుష్కర స్నానం చేయడం వల్ల పాపక్షయము కలుగుతుందని, పితృదోషాలు తొలగుతాయని నమ్మకం. విద్యాభివృద్ధి, జ్ఞానప్రాప్తి, వాక్చాతుర్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు, గురువులు, కళాకారులు సరస్వతీ పుష్కర స్నానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. పుష్కర కాలంలో దానం, జపం, తర్పణం, గోపూజ, అన్నదానం చేస్తే అనేక రెట్లు పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
పుష్కరాల్లో ముఖ్యంగా పితృతర్పణాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ కాలంలో నదిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇస్తే వారి ఆశీస్సులు లభిస్తాయని పురోహితులు వివరిస్తున్నారు. అలాగే బ్రాహ్మణ భోజనాలు, దానధర్మాలు చేస్తే కుటుంబానికి శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం.
