Ayodhya Ram Temple : “అయోధ్య రామాలయ నిర్మాణంతో నా జన్మ ధన్యమైంది. బాల రాముడికి కోవెల నిర్మించడం ద్వారా నా జన్మ చరితార్థమైంది. ఇంతకుమించి నాకింకా ఏం కావాలి. రాముడు మన ఆత్మ. రాముడు మన నడవడిక. రాముడు మన ధర్మం. రాముడు మన శాస్త్రం” నాడు రామాలయంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట రోజు ఇలానే చెప్పుకున్నాడు కదా నరేంద్ర మోదీ.. అప్పట్లోనే ఎన్నికల ముందు ఆగమాగంగా పనులు చేశారని.. గుడి పూర్తిగా కాకుండానే విగ్రహాన్ని ప్రతిష్టించారని… దానిని ఎన్నికల స్టంట్ లాగా వాడుకున్నారని బిజెపి పై, నరేంద్ర మోదీ పై విమర్శలు వచ్చాయి. దానిని కాషాయ పార్టీ నాయకులు ఖండించారు. ఇక ఎన్నికల్లో అయోధ్య రామాలయాన్ని బిజెపి తెగ ప్రమోట్ చేసుకుంది. నరేంద్ర మోదీ అవకాశం దొరికినప్పుడల్లా ప్రచారం చేసుకున్నారు. కానీ ఏం జరిగింది? తీరా అయోధ్యలో కూడా బిజెపి మొన్నటి ఎన్నికల్లో గెలవలేకపోయింది.. దీన్ని మర్చిపోకముందే అయోధ్యకు సంబంధించి మరో సంచలన విషయం సోమవారం ఉదయం నుంచి జాతీయ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే..
అయోధ్యలో నరేంద్ర మోదీ అత్యంత అట్టహాసంగా ఈ ఏడాది జనవరి 22న రాముడి ఆలయాన్ని ప్రారంభించారు. దానిని అత్యంత వైభవంగా నిర్వహించారు.. ఆ సందర్భంగా ఎంతో ఉద్వేగంగా నరేంద్ర మోదీ ప్రసంగించారు. అయితే ఎన్నో ఏళ్ల పాటు మన్నికగా ఉండాల్సిన ఆలయం.. పదికాలాల పాటు చెక్కుచెదరకుండా ఉండాల్సిన రామాలయం.. ఒక్క భారీ వర్షానికే కురుస్తోంది. గర్భగుడిలో ఇప్పటికే వర్షపు నీరు వచ్చి చేరింది. ఆలయాన్ని ప్రారంభించి సరిగ్గా ఆరు నెలలు కూడా పూర్తికాకముందే లీకేజీలు వెలుగు చూడడం అనేక ఆరోపణలకు తావిస్తున్నాయి.. ఈ ఏడాది ఉత్తర ప్రదేశ్ లో భారీ వర్షాలు ఇంకా కురవలేదు. ప్రస్తుతం అక్కడ ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి. ఆ మాత్రం వర్షాలకే గర్భగుడిలోకి నీళ్లు వచ్చి చేరాయని అయోధ్య రామాలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణ పటిష్టతపై ఆయన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు..”ఆలయ పై భాగాన్ని సరిగ్గా అమర్చలేదని మాకు అనిపిస్తోంది. ఈ నిర్మాణ క్రతువులో పాలుపంచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. నిర్మాణ సమయంలో ఎటువంటి సమస్యలు వెలుగు చూసాయో వాటికి గుర్తించాలి. ఒకటి లేదా రెండు రోజుల్లో పరిష్కరించాలి. ఈ సమస్యను పరిష్కరించకుంటే పూజలు చేయడం కష్టంగా మారుతుంది. వచ్చేది వానాకాలం.. విస్తారంగా వర్షాలు కురిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందని” సత్యేంద్ర దాస్ అంటున్నారు.
మరోవైపు గర్భగుడిలో లీకేజీల నేపథ్యంలో.. అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. వాస్తవానికి ఈ రామాలయం నిర్మాణాన్ని 2025 లోపు పూర్తి చేయాలని భావించారు. కానీ అప్పటికి నిర్మాణ పనులు పూర్తి కావడం దాదాపు అసాధ్యమని తెలుస్తోంది. ఎందుకంటే చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయట. నిర్ణీత స్థలాలలో ఇతర దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. ఇప్పటికీ అవి ఒక కొలిక్కి రాలేదు. వచ్చే ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అవి ఎలా పూర్తవుతాయో వారికే తెలియాలి. ఇక వర్షపు నీరు గర్భగుడి లీకేజీల ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తోంది. ఆ నీరు మొత్తం రామ్ లల్లా విగ్రహం చుట్టూ చేరింది. దాని వల్ల పూజలు చేసేందుకు ఇబ్బంది ఏర్పడుతోంది. అయితే ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని రామాలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ డిమాండ్ చేస్తున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More