లాక్ డౌన్ రెండవ దశ మే 3 వరకు కొనసాగనుంది. తదనంతరం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సడలింపు ఇచ్చినట్లయితే ఆ తర్వాత కరోనా మరింతగా విజృంభించే అవకాశాలు ఉన్నట్లు అనేకమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై మరో సంచలన వార్తను శాస్త్రవేత్తలు వెల్లడించారు. మే 3 తర్వాత ఎలాంటి కట్టడి చర్యలు చేపట్టకపోతే మే 19 నాటికి భారత్లో 38,220 కరోనా మరణాలు సంభవించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాదాపు 5.35 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కావొచ్చని అంచనా వేశారు.
జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్(జేఎన్సీఏఎస్ఆర్), బెంగళూరు ఐఐఎస్, ఐఐటీ బాంబే సంస్థలు ‘కొవిడ్-19 మెడ్ ఇన్వెంటరీ’ అనే సైంటిఫిక్ స్టాటిస్టికల్ మోడల్ ను ఉపయోగించి ఈ అంచనాలను సంయుక్తంగా రూపొందించాయి. గతంలో ఈ సంస్థలే ఇటలీ, న్యూయార్క్ లకు అంచనాలను రూపొందించారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఆయా ప్రాంతాలలో కేసులు నమోదయ్యాయి. ఈ బృందానికి భారత శాస్త్రీయ సలహాదారు విజయరాఘవన్ సహకరించారు. మే నెల మధ్య కల్లా 76 వేల ఐసీయూ బెడ్లు అవసరం పడొచ్చని జేఎన్సీఏఎస్ఆర్ ప్రొఫెసర్ సంతోష్ అనుసుమాలి అన్నారు.