Amit Shah- KTR: తెలంగాణ ముఖ్యమైన మంత్రి, భారత రాష్ట్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి.. వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతోపాటు పలురువు కేంద్ర మంత్రులను కలిశారు. ఈమేరకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇన్నాళ్లు కేంద్ర సాయం లేకున్నా.. అభివృద్ధి చెందుతున్నామంటూ మేకపోతు గాంభీర్యం ప్రకటించిన కేసీఆర్, కేటీఆర్కు ఆకస్మికంగా కేంద్రం సాయం అవసరం ఏమొచ్చిందన్న ఆసక్తి నెలకొంది. ఢిల్లీ వెళ్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా ఉంచడం చర్చనీయాంశమైంది. కేంద్రం కూడా కేటీఆర్ అపాయింట్మెంట్ కోరిన విషయం రహస్యంగా ఉంచడం గమనార్హం.
బండి సంజయ్ ప్రకటనతో..
కేటీఆర్ ఢిల్లీ పర్యటన విషయం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటనతో వెలుగులోకి వచ్చింది. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో ఇంటింటికీ వెళ్లిన బండి సంజయ్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణను మోసం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ను పెంచి పోషిస్తున్న కేసీఆర్.. ఆ విషయం నుంచి దృష్టి మళ్లించేందుకు కేటీఆర్ను ఢిల్లీకి పంపుతున్నాడని ప్రకటించారు. దీంతో కేటీఆర్ ఢిల్లీ పర్యటన అంశం బయటకు వచ్చింది.
మూడు రోజులు ఢిల్లీలోనే..
కేటీఆర్ ఢిల్లీలోనే రెండు రోజులు ఉండనున్నారు. ఇది పూర్తిగా అధికారిక పర్యటన అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు, ఆయన కుమారుడు కేటీఆర్ కేంద్ర మంత్రులను కలవడానికి వెళ్లడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆకస్మిక పర్యటన, అత్యవసర భేటీ వెనుక రసహ్యం ఏమై ఉంటుందని విపక్ష కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ నేతలు ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్కు వచ్చినప్పుడు మౌనం..
ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు హైదరాబాద్కు ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ మంత్రులు మౌనంగా ఉన్నారు. తెలంగాణ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లిన దాఖలాలు కూడా లేవు. ఇక ముఖ్యమైన మంత్రి కేటీఆర్ అయితే.. ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రులు, ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. తమకు కేంద్రం సహాయం ఏమీ అవసరం లేదు అన్నట్లు అహంకారపూరితంగా వ్యవహరించేవారు. కానీ, ఇప్పుడు కేటీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి షా తదితరులను కలవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
చెల్లిపై తగ్గిన ఈడీ దూకుడు..
కేటీఆర్ సోదరి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారాల తనయ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ నుంచి కీలకంగా ఉన్నట్లు ఈడీ పలు చార్జిషీట్లలో పేర్కొంది. దర్యాప్తులో మొన్నటి వరకు దూకుడుగా వ్యవహరించింది. తాజాగా దూకుడు తగ్గింది. కేసీఆర్, కేటీఆర్ కూడా బీజేపీపై విమర్శల దాడి తగ్గించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ వైఖరిలో మార్పు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో కేటీఆర్ ఢిల్లీ టూర్ ఆసక్తిరేపుతోంది.
అడగకుండా అమ్మకూడా పెట్టదు..
కేసీఆర్, ఆయన మంత్రులు తెలంగాణకు సంబంధించిన ఏ ప్రధాన సమస్యలనూ కేంద్రాన్ని సంప్రదించలేదు. ఈ పరిస్థితిలో కేంద్రం ఏమీ చేయడం లేదని ఆరోపించే హక్కు తెలంగాణ సర్కార్కు లేదని బీజేపీ తెలంగాణ నాయకులు ఆరోపిస్తున్నారు. అడగంది అమ్మకూడా పెట్టదు అన్నట్లు.. సాయం కావాలని అడగకుండా కేంద్రంపై విమర్శలు చేయడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేంద్రం ఇచ్చిన నిధులపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దీనికి బీఆర్ఎస్ నుంచి కౌంటర్ లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ఐదు నెలల సమయం ఉన్నందున, కేసీఆర్ తన కుమారుడిని ఢిల్లీకి వెళ్లి, తెలంగాణ పెండింగ్ సమస్యలను కేంద్రంతో, ముఖ్యంగా అమిత్ షాతో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేంద్రాన్ని అడిగి బద్నాం చేయాలన్న ఉద్దేశంతో కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.