Homeజాతీయ వార్తలుTelugu language in Sri Lanka: శ్రీలంకలో తెలుగు మాతృభాషగా ఆ కాలంలోనే ఉందా..? రాగి...

Telugu language in Sri Lanka: శ్రీలంకలో తెలుగు మాతృభాషగా ఆ కాలంలోనే ఉందా..? రాగి శాసనం ఏం చెబుతోంది..?

Telugu language in Sri Lanka: తెలుగురాష్ట్రాల్లో మాత్రమే మాతృభాషగా ఉన్న తెలుగు శతాబ్దాల కిందటే పక్క దేశంలోనూ మాతృభాషగా విలసిల్లిందా..? ఒకప్పుడు తమిళం, తెలుగు మాట్లాడిన వారు ఒక్క చోటే నివసించారా..? అన్న ప్రశ్నలకు ఓ రాగి శాసనం సమాధానం చెబుతోంది. శ్రీలంకలోని తంబంకాడులోని చిత్రవేలాయుధర్ ఆలయంలో ఓ రాగి శాసనాన్ని చరిత్రకారులు కనుగొన్నారు. దీనిపై తమిళం అక్షరాలతో పాటు తెలుగు అక్షరాలు కూడా ఉన్నాయి. శ్రీలంకలోని వాయువ్య, తూర్పు ప్రావిన్సులు కలిసే చోట ఉన్న చిత్రవేలాయుధర్ ఆలయంలో దొరికిన రాగి శాసనంపై తమిళ అక్షరాలను ప్రొఫెసర్ పుష్ఫరత్నం ధ్రువీకరించారు. తెలుగు అక్షరాలను కొంత మంది భాషా నిపుణులు కనుగొన్నారు.

పాలన్నోరువా, బట్టికలోవా అనే ప్రాంతాల మధ్య చిత్రవేలాయుధర్ ఆలయం ఉంది. పాలన్నోరువా ప్రాంతం ఎన్నో ఏళ్ల చరిత్రను కలిగి ఉంది. బ్రిటిష్ కాలం నుండే పాలన్నోరువా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇక్కడే ఉన్న మన్నంపిటియాలో బౌద్ధ దేవాలయాలు, దేవాలయ అవశేషాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే చిత్రవేలాయుధర్ ఆలయం కూడా ప్రాముఖ్యం పొందిందని భావిస్తున్నారు. అయితే ఈ ఆలయం ఎప్పుడు నిర్మాణం జరిగిందో తేల్చలేకపోయారు. ఎందుకంటే ఆలయం గురించి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఇది శూలం చిహ్నాన్ని కలిగిన ఆలయం కనుక ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయంగా భావిస్తున్నారు.

ఈ ఆలయాన్ని పునరుద్ధరణ సమయంలో కొందరికి దొరికిన పాత అవశేషాలు, పూజ సామగ్రిని ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక స్థలంలో భద్రపరిచారు. ఆ స్థలంలో ఈ రాగి శాసనం లభ్యమైంది. 5 అడుడులు పొడవు ఉన్న ఈ స్థంభంపై రాగిపూత అమర్చి ఉంది. స్థంభం ప్రారంభంలో, చివరిలో పద్మాకార చిత్రాలున్నాయి. ఎడమవైపు తెలుగులో అక్షరాలుండగా.. కుడివైపు తమిళ అక్షరాలను లిఖించారు. ఈ శాసనంపై ఆలయానికి రాగి మెట్లు నిర్మించడానికి ప్రజల నుంచి విరాళాలు సేకరించారని రాశారు.

బట్టికలోవా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఉన్న స్మారక చిహ్నాలపై తమిళంలో అక్షరాలు కనిపిస్తాయి. కానీ చిత్రవేలాయుధర్ ఆలయంలో మాత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా అక్షరాలు లిఖించబడ్డాయి. 15వ శతాబ్దంలో తూర్పు ప్రావిన్స్ లోని బట్టికలోవా ప్రాంతాన్ని కాండి రాజు పాలించారు. పాలకులు తమిళులే అయినా వారి మాతృభాషను తెలుగుగానే గుర్తించారు. వీరు మధురై నాయక వంశానికి చెందిన వారుగా తెలుస్తోంది. అయితే శాసనంలోని వివరాలను చదివిన తరువాత దీనికి 18 లేదా 19వ శతాబ్దంలో తయారు చేసినట్లు తెలుస్తోందని ప్రొఫెసర్ పుష్పరత్నం అంటున్నారు.

శ్రీలంకలో కాండీ పాలనలో తెలుగును మాతృభాషగా గుర్తించారని తెలుస్తోంది. ఇక జాఫ్నా రాజ్య కాలంలో తమిళులే కాకుండా తెలుగు మాట్లాడేవారు కూడా సైనిక విభాగంలో పనిచేసినట్లు తెలుస్తోంది. ఆ తరువాత రాజ్య పతనం అయినా చాలా మంది తమిళులు అక్కడే నివసించారు. అయితే తమిళ సాంప్రదాయం శ్రీలంకలో ఉందనడానికి ఈశాసనమే ఆధారమని అంటున్నారు. అయితే చరిత్ర కారులు ఈ విషయాన్ని స్ఫష్టంగా చెప్పలేకపోతున్నారు.

దేశంలోని చాలా ఆలయాల్లో మరిన్ని పరిశోధనలు చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు, తమిళం మాట్లాడేవారు ఏయే ప్రదేశాల్లో నివసించారో తెలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా దొరికిన రాగి శాసనాన్ని బట్టి చూస్తే తంబకాడు ప్రాంతంలోని మరికొన్ని చోట్ల ఇలాంటి శాసనాలు లభ్యం కావచ్చని అంటున్నారు. దక్షిణాదిన తమిళ, తెలుగువారు తమ సౌలభ్యం కోసం చాలా ప్రదేశాల్లో సంచరించారని, ఇందులో భాగంగానే శ్రీలంకలోని తంబకాడు ప్రాంతంలోకి వచ్చారని అంటున్నారు. ఏదేమైనా తెలుగు మాతృభాషను ఆ కాలంలోనే గుర్తించడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగానే చెప్పుకోవచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version