Homeజాతీయ వార్తలుCM KCR Paddy Issue: ఉసిగొల్పడమేనా? ఉద్యమించేది ఏమైనా ఉందా కేసీఆర్ ...

CM KCR Paddy Issue: ఉసిగొల్పడమేనా? ఉద్యమించేది ఏమైనా ఉందా కేసీఆర్ సార్..?

CM KCR Paddy Issue: నడిపించే వాడిని నాయకుడు అంటారు.. ‘నువ్వు ముందు నడువు.. నీ వెనుక నేను ఉంటా’ అనేవాడిని.. పిరికి వాడు అంటారు.. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా ధాన్యం కొనుగోలు ఉద్యమంలో నాయకులు వెనుకుండి.. కింది స్థాయి నేతలతో పోరు సలుపుతున్నారు. ఈ ఉద్యమాన్ని ఏమనాలో అర్థం కావడం లేదని రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది.

రాష్ట్రంలో యాసంగిలో పండిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 4 నుంచి 11 వరకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈమేరకు ఈనెల 4న మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. 6వ తేదీన జాతీయ రహదారుల దిగ్బంధం చేపట్టారు. గురువారమైన నేడు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనల్లో ఎక్కడా ముఖ్యమంత్రి కేసీఆర్‌  కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి..  . ఈనెల 11న ఢిల్లీలో తలపెట్టిన ధర్నాలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాల్గొంటారా లేదా అనేది కూడా స్పష్టత లేదు. రాష్ట్రంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకే మంత్రులు దూరంగా ఉండడం చూస్తుంటే ఢిల్లీలో తలపెట్టే ధర్నాలో కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు.. మంత్రులు పాల్గొనడం అనుమానమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

CM KCR Paddy Issue
CM KCR Paddy Issue

-రైతుల్లేని ఆందోళనలు..
యాసంగి ధాన్యం కొనుగోలులో కేంద్రాన్ని బద్నాం చేసేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ పోరుబాట పట్టింది. వానాకాలం ధాన్యం కొనుగోళ్ల సమయంలో కూడా పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ధర్నాలో పాల్గొన్నారు. జిల్లాల్లో కూడా నాయకులు ఆందోళన చేశారు. ఆ తర్వాత ‘యాసంగిలో రైతులు వరి పండిచొద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని’ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో చాలామంది రైతులు తమ పొలాలను బీళ్లుగానే వదిలేశారు. కేసీఆర్‌ మాత్రం తన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి సాగు చేశారన్న విమర్శ ఉంది. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బయట పెట్టారు. కేసీఆర్‌ సాగుచేసిన వరి ఫొటోలను మీడియా సమావేశంలో బహిర్గతం చేశారు. కేసీఆర్‌ ధాన్యం ఎవరు కొంటారో వారే రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం కొనాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఇప్పటి వరకు కూడా కేసీఆర్‌ స్పందించలేదు.

Also Read: BP Sugar in Telangana: తెలంగాణ ప్రజలకు బీపీ, షుగర్ పెరగడానికి కారణాలేంటి?

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి ఖండించారు.. ‘కేసీఆర్‌ రైతు.. తాను తినడానికి ఫాం హౌస్‌లో వరి వేసుకున్నడు. అది కూడా తప్పా’ అంటూ కౌంటర్ ఇచ్చారు.. అయితే 150 ఎకరాల్లో పండిన పంట కేసీఆర్‌ కుటుంబం తింటుందా అన్న విమర్శలు వచ్చాయి. దీంతో అందరూ సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో వరి సాగు పెరిగింది. తాజాగా పంటలు కొతకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొనుగోలు కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనాలని రైతులు ఆందోళన చేసే అవకాశం ఉంది. రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం తానే ఉద్యమం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఈనెల 3న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ర్ట మంత్రి కేటీఆర్‌ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 4 నుంచి 11 వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేసి యాసంగి ధాన్యం కొనేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ప్రకటించారు. ఈమేరకు 4న మండల కేంద్రాల్లో నిరసన తెలిపారు, 6న నల్లగొండ, యాదాద్రి భువనగిరి, నిర్మల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మేడ్చల జిల్లాల్లో జాతీయ రహదారులపై ఆందోళన చేశారు. 7న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. అయితే ఈ మూడు ఆందోళనల్లో టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు మినహా రైతులు కానరావడం లేదు. అధికార పార్టీ నాయకుల హడావుడే ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఆందోళనలు విఫలమవుతున్నాయన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది.

-సార్‌ ఫ్యామిలీ సైతం బరిలోకి.. కేసీఆర్ మాత్రం దూరం
యాసంగి ధాన్యం కొనుగోలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లలో ధర్నా చేశారు. కేసీఆర్‌ ఫ్యామిలీలోని ప్రజాప్రజాప్రతిధులందరూ ఆందోళన చేశారు. తాము రైతుల కోసమే పోరాటం చేస్తున్నామని ప్రెస్‌మీట్లు పెడుతున్న  ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌రావు ఎక్కడా ప్రత్యక్ష ఆందోళనల్లో కనిపించడం లేదు. రైతుల తరఫున పోరాటం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నవారు ప్రత్యక్ష ఆందోళనలకు దూరంగా ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

-రైతులు రావడం లేదనే దూరంగా ఉంటున్నారా..?
తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారితోపాటు పోలీస్‌ కిష్టయ్య లాంటి తెలంగాణ ఉద్యమకారులు సుమారు 1,200 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఉద్యమంలో ఆదినుంచి లేని కేటీఆర్‌ ప్రభుత్వంలో, పార్టీలో కీలక పోస్టులో ఉన్నారు. కవిత కూడా ఒకసారి ఎంపీ, రెండుసార్లు ఎమ్మెల్సీగా పదవులు పొందారు.  ఆందోళనల్లో రైతులు పాల్గొనకపోవడంతోనే కేసీఆర్‌ కుటుంబం ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలో మాత్రం కేటీఆర్, హరీశ్ రావులు  కనిపించి కేంద్రంపై నిప్పులు చెరిగారు.

CM KCR Paddy Issue
CM KCR Paddy Issue

-ఢిల్లీకి వెళ్లేదెవరో..?
సొంత రాష్ట్రంలోనే ఆందోళనలకు దూరంగా ఉంటున్న కేసీఆర్‌ కుటుంబం ఈనెల 11న ఢిల్లీలో చేపట్టే ధర్నాలో పాల్గొంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీకి అసలు ఎవరెవరు వెళ్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. వారితోపాటు రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఢిల్లీ వెళ్లారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్‌ కుటుంబం ఢిల్లీ పోరాటానికి కూడా దూరంగా ఉంటారని తెలుస్తోంది. ఆందోళన ఉధృతమై పరిస్థితి అదుపు తప్పితే ఢిల్లీలో అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉంది. ఆ భయంతోనే వారు ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొనడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా వరి పోరును ముందుండి నడిపించాల్సిన కేటీఆర్‌ ముఖం చాటేయడం, కేసీఆర్‌ కుటుంబం దూరంగా ఉండడంపై పార్టీలోనూ అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులను ఆందోళనకు ఉసిగొల్పుతూ కేసీఆర్‌ కుటుంబం దూరంగా ఉండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:TDP: భ్రమలు వీడెదెన్నడు.. ప్రజా పోరాటాలకు దూరంగా పచ్చ పార్టీ

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version