Telangana Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్డౌన్ కొనసాగుతోంది. ప్రచారానికి ఇంకా మూడు రోజుల సమయమే ఉంది. ఈనెల 30న జరగనున్న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు నాడి పట్టేందుకు అనేక సర్వే సంస్థలు ప్రయత్నించాయి. సర్వే ఫలితాలు కూడా వెల్లడించాయి. కానీ వాస్తవం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. తెలంగాణ ఓటర్లు ఇంకా ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేదు. ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. కానీ, సర్వే సంస్థలు కొన్ని బీఆర్ఎస్కు, మరికొన్ని కాంగ్రెస్కు అనుకూలంగా ఫలితాలు వెల్లడించాయి.
అగ్రనేతల తిష్ట..
ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రచారానికి కేవలం మూడు రోజుల సమయం ఉండడంతో ప్రచార పర్వం ఊపందుకుంది. ఇప్పటికే జోరుగా ఉన్న ప్రచారంలో ఇప్పుడు అగ్రనేతలు కూడా రావడం.. తిష్టవేసి.. మరీ తెలంగాణలో ప్రచారం చేయడం గమనార్హం. హోరాహోరీగా సాగుతున్న ప్రచారంతో ప్రస్తుతం తెలంగాణ సమాజం ఎటు వైపు నిలబడిందో చెప్పడం కష్టంగా మారింది. వాస్తవానికి 2018 ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సమాజం స్పష్టమైన విధానం ఎంచుకుంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చింది. కానీ.. ఇప్పుడు, తెలంగాణ ప్రజలు ఎటువైపు మొగ్గుతున్నారనేది ఎవరికీ అంతు చిక్కలేదు. ఏ సర్వే చేసినా.. చూసినా.. అంతా అయోమయం.. చిందరవందర గందరగోళంగానే ఉంది.
అన్ని పార్టీల్లో ఆశలు..
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. అన్ని పార్టీలకు గెలుపుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇంకా కొంచెం కష్టపడితే అధికారంలోకి కావొచ్చని భావిస్తున్నాయి. 2018లో ప్రధాని మోదీ కేవలం రెండు సభల్లోనే పాల్గొన్నారు. అమిత్షా ఐదు సభల్లో పాల్గొన్నారు. ఇక, బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. 15 సభల్లో పాల్గొని ప్రచారం చేశారు. అదేసమయంలో కాంగ్రెస్–టీడీపీలు 25 సభలు నిర్వహించాయి. అయితే..అప్పట్లో టీడీపీ పోటీ చేయడంతో తెలంగాణ సమాజం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసింది. కేసీఆర్కే పట్టం కట్టాలని నిర్ణయించుకుంది. కానీ ప్రస్తుతం మోదీ 10 సభలకు వచ్చారు. అమిత్షా 15 సభలు, నడ్డా 10 సభలు, యోగి ఆదిత్యనాథ్ 6 సభలు, పవన్కళ్యాణ్ 6 సభలు, కేసీఆర్ 80కిపైగా సభలు నిర్వహించారు. ఇంకా మూడు రోజుల సమయం ఉంది.
అన్ని పార్టీల ప్రచారం..
ఇప్పుడు ఉన్నవన్నీ.. జాతీయ పార్టీలు, అచ్చం.. తెలంగాణ పార్టీలు మాత్రమే పోటీలో ఉన్నాయి. దీంతో ప్రజానాడిని పట్టుకోవడం .. ఏ పార్టీకీ సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలోనే అగ్రనేతల నుంచి చోటా నేతల వరకు అందరూ మూకుమ్మడిగా ప్రచారంలో పాల్గొంటున్నారు. విరివిగా సభలు నిర్వహిస్తున్నారు. ప్రచార పర్వానికి మూడు రోజులే.. ఉండడంతో మరింత ఊపు తెచ్చారు. మరి తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కడతారో.. లేక హంగుకే జై కొడతారో చూడాలి.