టి20 వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ దాకా దక్షిణాఫ్రికా జట్టుకు ఓటమి అనేది లేదు. బలమైన టీం ఇండియాను సైతం ఓడించింది. ఏకంగా సెమి ఫైనల్ దాకా దూసుకెళ్లింది. సెమి ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టు అదే మ్యాజిక్ చేస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా దక్షిణాఫ్రికా జట్టు బంగపాటుకు గురైంది.. సెమి ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
దక్షిణాఫ్రికా జట్టును న్యూజిలాండ్ ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది అంటే.. కివీస్ బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయిన దక్షిణాఫ్రికా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఎనిమిది టికెట్లు నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం టార్గెట్ ఫినిష్ చేసే క్రమంలో న్యూజిలాండ్ జట్టు కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి 12.5 ఓవర్లలో 173 పరుగులు చేసి.. అద్భుతమైన విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ ఓపెనర్లు సీ ఫెర్డ్ (58), అలెన్ (100*) దుమ్మురేపారు. వీరిద్దరూ తొలి వికెట్ కు ఏకంగా శతక భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఫలితంగా న్యూజిలాండ్ ఏ దశలో కూడా ఓడిపోయే విధంగా కనిపించలేదు.. న్యూజిలాండ్ ఓపెనర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా బౌలర్లు ప్రేక్షకులు మాదిరిగా మారిపోయారు.
ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టుకు ఏ దశలో కూడా పాజిటివ్ వైబ్స్ కనిపించలేదు. కేవలం 12 పరుగులకే రెండు వికెట్ల కోల్పోయింది. క్వింటన్ డికాక్, రికెల్టన్ వెంట వెంటనే అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా జట్టు మీద ఒత్తిడి పెరిగిపోయింది. కెప్టెన్ మార్క్ రం కూడా ఆకట్టుకోలేకపోయాడు.. చివర్లో యాన్సన్ (55*) మాత్రమే సత్తా చూపించాడు. అతడు గనుక నిలబడకపోయి ఉంటే దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. న్యూజిలాండ్ బౌలర్లలో రచిన్ రవీంద్ర రెండు వికెట్లు.. హేన్రి రెండు వికెట్లు.. కోలే మెక్ కాంచి రెండు వికెట్లు పడగొట్టారు.
దక్షిణాఫ్రికా జట్టు 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా వెళ్ళింది. ఫైనల్ మ్యాచ్లో టీమిండియా చేతిలో ఓడిపోయింది. 2025లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా మీద గెలిచింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు తన ముఖచిత్రాన్ని మార్చుకుందని అందరూ అనుకున్నారు. కానీ అది తాత్కాలికమేనని.. తాము ఎప్పటికీ చోకర్స్ టీం అని దక్షిణాఫ్రికా నిరూపించుకుంది. మరోవైపు టి20 వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్ ఆటగాడు అలెన్ అద్భుతమైన ఘనత సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు