Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : అన్నపూర్ణ లాంటి ఆంధ్రాను క్రాప్ హాలీడే చేసిన పాపం వైసీపీదే :...

Pawan Kalyan : అన్నపూర్ణ లాంటి ఆంధ్రాను క్రాప్ హాలీడే చేసిన పాపం వైసీపీదే : పవన్ కళ్యాణ్

Pawan Kalyan criticizes crop holiday in AP : ఆంధ్రా అంటే ఒకప్పుడు అన్నపూర్ణ.. కోనసీమ చుట్టూ పరుచుకునే పచ్చందాలు యావత్ దేశంలోనే ఎక్కడా ఉండేవి కావు.. అంతటి అందమైన పచ్చటి ప్రాంతాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం ఎండగొట్టింది. రైతులను పంటలను పండించకుండా చేసి క్రాప్ హాలీడే దుస్థితికి దిగజారింది. ఈ పాపం వైసీపీదేనని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.రైతాంగంపట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్లే ఈ ప్రాంత రైతులు పంట విరామ నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. కోనసీమ రైతులకు జనసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, చేసిన తప్పిదాలు వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో ఈ రోజు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి దాపురించిందని జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శించారు.. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరని… కాలువలు, డ్రెయిన్ల మరమ్మత్తులు, పూడిక తీత, గట్లు పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపడం లేదు. రంగు మారిన ధాన్యానికి ధర ఇవ్వరు. ఇలాంటి ఇబ్బందులతోనే రైతాంగం పంట వేయకూడదనే నిర్ణయం తీసుకుంది. దాదాపు 11 ఏళ్లు తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులు దాపురించడం చాలా బాధాకరం. తొలకరి పంట వేయలేమని కోనసీమ రైతులు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పంట విరామ నిర్ణయాన్ని తీసుకున్నారు. అన్నం పెట్టే రైతు కోసమే ఏ ప్రభుత్వ పథకాలైన ఉంటాయి. అలాంటి అన్నదాతలే పంట పండించలేమని తేల్చి చెబుతున్నారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. క్రాప్ హాలీడే ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుంటుందని ఏపీ రైతాంగం దుస్థితిని పవన్ కళ్యాణ్ కళ్లకు కట్టారు.

‘నాకు తెలిసి 2011లో ఒకసారి జరిగింది. దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంట విరామం ప్రకటించారు. ఆనాడు గోదావరి జిల్లాల రైతుల నిర్ణయం దేశాన్ని కుదిపేసింది. దాదాపు 13 జాతీయ పార్టీల నేతలు కోనసీమకు తరలివచ్చి రైతాంగం సమస్యలు తెలుసుకున్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకూడని కొన్ని మార్గనిర్దేశకాలు చేశారు. ఇప్పుడు 11 ఏళ్లు తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితే దాపురించింది. అల్లవరం, ఐ. పోలవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండలాల్లో 25 వేల ఎకరాలు, అలాగే అమలాపురం రూరల్, మామిడికుదురు, కాట్రేనికోన, సఖినేటిపల్లి మండలాల్లో 20 వేల ఎకరాలు, కడియం మండలంలో కూడా కొన్ని వందల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారు. దాదాపు 50 వేల ఎకరాలకు పైగా పంట విరామం ప్రకటించడం చూస్తుంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్ధమవుతోంది’అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.

* భయపడి రాత్రికి రాత్రి డబ్బులు వేశారు
కోనసీమ రైతాంగం క్రాప్ హాలీడే ప్రకటించడానికి వైసీపీ చేసిన తప్పులే కారణం. రైతుల నుంచి రబీలో కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదు. దాదాపు రూ. 475 కోట్లు బకాయిలు ఉన్నాయి. రైతులు పంట విరామం ప్రకటించడంతో రాత్రికి రాత్రి వారి ఖాతాల్లో రూ. 139 కోట్లు జమ చేస్తున్నట్లు ప్రకటించారు. క్రాప్ హాలీడే ప్రకటించిన మండలాల్లో సాగు నీరు అందటంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. పంట కాలువలను, డ్రెయిన్లను ప్రభుత్వం మరమ్మతులు చేయడం లేదు. పూడికతీత, గట్టు పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపలేదు. తొలకరి పంటకు భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ధాన్యం రంగు మారితే ప్రభుత్వం ధర ఇవ్వడం లేదు. ముఖ్యంగా రైతుల నుంచి వినిపిస్తోన్న ప్రధాన డిమాండ్ కూలీ రేట్లు బాగా పెరిగిపోయాయి… జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నా ఎందుకో కార్యరూపం దాల్చలేదు. కేవలం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, నిర్లక్ష్య ధోరణితోనే ఈ రోజు కోనసీమ రైతాంగానికి ఈ పరిస్థితి దాపురించిందని పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు.

* వైసీపీ నాయకులవి చౌకబారు విమర్శలు
పంట విరామం ప్రకటించిన రైతులపై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం చౌకబారుతనంగా ఉందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇసుక లేదని భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కితే వాళ్లనూ ఇలానే తిట్టారని… తల్లిదండ్రుల మార్గనిర్దేశం సరిగాలేకనే 10వ తరగతి విద్యార్ధులు ఫెయిల్ అయ్యారని అన్నారు. ఆడబిడ్డ మానమర్యాదలకు భంగం వాటిల్లితే తల్లి పెంపకం సరిగా లేదని విమర్శలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఉద్యోగులు రోడ్డెక్కితే బాధ్యత లేదని కామెంట్లు చేశారు. ఇలా ఏ సమస్య వచ్చినా రాజకీయ కోణంలో చూడటం తప్ప… సమస్యను పరిష్కరించే మనస్తత్వం లేదు వీళ్లకు. పంట విరామం ప్రకటించిన రైతాంగంపై వైసీపీ నాయకులు రాజకీయ కోణంలో విమర్శలు చేయడం బాధాకరం. రైతు సోదరులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు జనసేన పార్టీ అండగా నిలబడుతుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు కోనసీమ రైతులకు అండగా జనసేన పోరాటానికి సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ ఈ పోరాటాన్ని ముందుండి తీసుకెళ్లబోతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version