KCR Increases ST quota: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడం.. నరేంద్ర మోదీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చద్రశేఖర్రావు ఇన్నాల్లూ చేస్తున్న ప్రయత్నంలో తాజాగా ఒక ఆస్త్రం దొరికింది. ఇన్నాళ్లూ బీజేపీ వేసే గూగ్లీలతో డిఫెన్స్లో పడుతున్న కేసీఆర్ ఎన్నకేలకు మోదీని డిఫెన్స్లో పడేసే గూగ్లీ సంధించారు. మోదీని ఇరుకున పెట్టడంతోపాటు జాతీయ రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కేసీఆర్కు మైలేజీ పెంచే గిరిజన రిజర్వేషన్ అస్త్రం దొరికింది. తెలంగాణలో దూకుడుగా దూసుకుపోతున్న కమలం పార్టీని నిలువరించేందుకు మొదట దీనిని రాష్ట్రంలో ప్రయోగించారు.

పది రోజుల్లో జీవో..
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ పది రోజులలో జీవో జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన ఆదివాసి బంజారా ఆత్మీయ సభలో ఆయన మాట్లాడారు. గిరిజనులకు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని, వారి రిజర్వేషన్ల కోసం తెస్తున్న జీవోను గౌరవించడం ద్వారా.. ప్రధాని నరేంద్ర మోదీ గిరిజన సంక్షేమంపై తన చిత్తశుద్ధిని చాటుకోవాలనానరు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తుందని విస్పష్టంగా ప్రకటించారు.
ఇరకాటంలో మోదీ..
నిజానికి ఈ ప్రకటన కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు దక్కగల ప్రయోజనాన్ని కేంద్రమే అడ్డుకుంటోందనే ఆరోపణలతో కేసీఆర్ ముందు ముందు విరుచుకు పడడానికి ఇది ఆస్కారం కల్పిస్తోంది. అయితే కేసీఆర్ చాలా వ్యూహాత్మక ఎత్తుగడగా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అంశాన్ని ఇప్పుడు తెరమీదకు తెచ్చినట్లుగా కనిపిస్తోంది. జాతీయ రాజకీయాలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్కు గిరిజన రిజర్వేషన్ అంశం కొంత కలిసివచ్చే అంశమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేంద్రం కోర్టులో బంతి…
సందర్భం ఫలానా అని చెప్పకపోయినప్పటికీ ఆదివాసి బంజారా ఆత్మీయ సభ తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులకు ఐదు నుంచి ఆరు శాతం రిజర్వేషన్లు మాత్రమే దక్కుతూ వచ్చాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రతిపాదనలు తయారుచేసి కేంద్రానికి పంపితే వాటికి ఇప్పటిదాకా అతీగతీ లేదని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడైనా కేంద్రం శ్రద్ధ తీసుకొని ఆ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించి పంపాలని అనడం ద్వారా బంతిని కేసీఆర్ కేంద్రం కోర్టులోకి నెట్టేశారు.

జీవో జారీచేస్తే..
పది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల 10 శాతం రిజర్వేషన్ గురించి జీవో తెస్తుందని రాష్ట్రంలో అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.ఇలాంటి జీవో వచ్చినా సరే అది న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఎక్కువ. ఈవిషయం కేసీఆర్కు తెలియంది కాదు. కానీ న్యాయపరంగా ఎంత వివాదం రేగితే అంతగా కేంద్రంపై నిందలు వేయడానికి కేసీఆర్కు అంత అవకాశం దొరుకుతుంది. జీవో తేవడం ద్వారా గిరిజనుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంది కానీ, బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమే మోకాలు అడ్డుతోంది, కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది.. అని నిందించడానికి అవకాశం దొరుకుతుంది.
రిజర్వేషన్ల పెంపు ఓ తేనెతుట్టె..
గిరిజన రిజర్వేషన్ల పెంపు వ్యవహారం అనేది కేంద్రం దృష్టిలో క్లిష్టమైనది. తేనెతుట్టె లాంటిది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించడం ద్వారా ఆ తేనె తుట్టెను కదిలిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం భయం. సరిగ్గా ఆ సంక్లిష్టతనే తనకు అనుకూలంగా వాడుకోదలుచుకుంటున్నారు కేసీఆర్. తెలంగాణలో కమలం పార్టీపై రిజర్వేషన్ దాడి మొదలు పెట్టి దానిని క్రమంగా దేశవ్యాప్తంగా రగిలించాలనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి మాటల కూర్పుతో ఎదురు దాడికి సిద్ధమవుతుందో వేచి చూడాలి.