Ishan Kishan : టి20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబోలో భారత జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు టాస్ గెలిచింది. బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్ కు సహకరిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా బౌలింగ్ వైపు దృష్టి సారించాడు.
సల్మాన్ బౌలింగ్ ఎంచుకోవడంతో పాటు.. ప్రారంభ ఓవర్ తనే వేశాడు. తొలి బంతిని ఇషాన్ కిషన్ డిఫెన్స్ ఆడాడు. రెండవ బంతికి సింగిల్ తీశాడు. స్ట్రైక్ అభిషేక్ శర్మ అందుకున్నాడు.
అభిషేక్ శర్మ ఇటీవల కాలంలో సూపర్ ఫామ్ లో ఉన్న నేపథ్యంలో.. పాకిస్తాన్ జట్టుపై భారీగా పరుగులు తీస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, అభిషేక్ శర్మ మూడు బంతులను ఎదుర్కొన్నప్పటికీ ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు.
మూడు బంతులు డాట్ గా మారిన నేపథ్యంలో అభిషేక్ శర్మ ఒక రకమైన ఒత్తిడికి గురయ్యాడు. ఆ తర్వాత బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అది కాస్త గాల్లో లేవడంతో క్యాచ్ అవుట్ అయ్యాడు.
అభి షేక్ శర్మ అవుట్ కావడంతో పాకిస్తాన్ జట్టులో ఆనందం నెలకొంది. ఈ మ్యాచ్ కంటే ముందు అభిషేక్ శర్మ పై తాము ప్రత్యేక దృష్టిసారించామని పాకిస్తాన్ కెప్టెన్ వ్యాఖ్యానించాడు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కూడా అతడు ఇదే విషయాన్ని పరోక్షంగా పేర్కొన్నాడు. అభిషేక్ శర్మ అవుట్ కావడంతో టీమ్ ఇండియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టలేదని అందరూ అనుకున్నారు. పైగా తొలి ఓవర్ లో పాకిస్తాన్ జట్టు ఒక పరుగు మాత్రమే ఇచ్చింది. అందులోనూ ప్రమాదకరమైన అభిషేక్ శర్మ అవుట్ కావడంతో టీమిండియా పై ఒత్తిడి పెరుగుతుందని అందరూ అనుకున్నారు.
పాకిస్తాన్ జట్టు ఊహించింది ఒకటైతే.. జరిగింది మరొకటి. ఎందుకంటే అభిషేక్ అవుట్ అయినప్పటికీ.. మరో ఎండ్ లో ఇషాన్ కిషన్ నిలబడ్డాడు. పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 40 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్ 10 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు.
అభిషేక్ శర్మ ను అవుట్ చేసిన ఆనందంలో ఉన్న పాకిస్తాన్ బౌలర్లు.. ఇషాన్ కిషన్ ను పట్టించుకోలేదు. కిషన్ తిలక్ వర్మతో కలిసి రెండో వికెట్ కు 46 బంతుల్లో 87 పరుగులు జోడించాడు. వాస్తవానికి ఇషాన్ కిషన్ ఈ స్థాయిలో ఆడతాడని పాకిస్తాన్ జట్టు ఊహించి ఉండదు. అందువల్లే ఒక పరుగుకు ఒక వికెట్ కోల్పోయిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత రెండో వికెట్ కు బలమైన భాగస్వామ్యం నెలకొల్పింది. బౌలింగ్ పిచ్ మీద పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించింది.