ISRO Chief Somnath : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చీఫ్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ఆదిత్య ఎల్1 ప్రయోగం చేసిన రోజే తనకు క్యాన్సర్ నిర్ధారణ అయిందని తెలిపారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు. ఓ మలయాళ వెబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు.
చంద్రయాన్-3 సమయంలోనే..
చంద్రయాన్-3 ప్రయోగ సమయంలోనే తనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయని స్వామినాథ్ తెలిపారు. అయితే ఆ సమయంలో స్పష్టమైన అవగాహన లేదన్నారు. కానీ, ఆదిత్య ఎల్1 మిషన్ ప్రయోగించిన ఉదయమే వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. తనకు కొద్ది సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారని వెల్లడించారు. ప్రయోగం తర్వాత తాను చెన్నై వెళ్లి మరిన్ని పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. అందులో తన కడుపులో కణితి పెరిగినట్లు గుర్తించారని చెప్పారు. రెండు మూడు రోజుల తర్వాత అది క్యాన్సర్ కణితి అని నిర్ధారణ అయిందని వెల్లడించారు. అది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి కుటుంబసభ్యులతోపాటు సహోద్యోగులు షాక్ అయ్యారన్నారు.
ఆరోజే ఆపరేషన్..
ఇక 2023, సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం చేపట్టామని, ఆ తర్వాత తాను ఆస్పత్రికి వెళ్లానని తెలిపారు. ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించినట్లు చెప్పారు. దీంతో శస్త్రచికిత్సతోపాటు కీమోథెరపీ కూడా చేయించుకున్నట్లు పేర్కొన్నారు. అవన్నీ భరించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే, మొత్తంగా నాలుగు రోజులే ఆసుపత్రిలో ఉన్నట్లు తెలిపారు. ఐదోరోజు నుంచి ఇస్రోలో బాధ్యతల్లో నిమగ్నమయినట్లు వెల్లడించారు. క్యాన్సర్ అని తెలిసినప్పుడు తాను కూడా కాస్త కంగారు పడ్డాడనని, కానీ పూర్తి చికిత్స తర్వాత క్యాన్సర్కు పరిష్కారమైన చికిత్స ఉందని అవగాహన వచ్చిందని చెప్పారు.